ఎక్కడి పనులు అక్కడే
ABN , First Publish Date - 2023-06-07T01:06:00+05:30 IST
శ్రీశైలం సొరంగమార్గం, ఎస్ఎల్బీసీ ఓపెన్కెనాల్, డిండి ఎత్తిపోతల, పెండ్లిపాకల ప్రాజెక్ట్ ఎత్తుపెంపు, నక్కలగండి రిజర్వాయర్ల నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్నా, గడువు ముగుస్తున్నా ముందుకు సాగడంలేదు.
శ్రీశైలం సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల పూర్తి ఎప్పుడో ?
శ్రీశైలం సొరంగమార్గం, ఎస్ఎల్బీసీ ఓపెన్కెనాల్, డిండి ఎత్తిపోతల, పెండ్లిపాకల ప్రాజెక్ట్ ఎత్తుపెంపు, నక్కలగండి రిజర్వాయర్ల నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్నా, గడువు ముగుస్తున్నా ముందుకు సాగడంలేదు. నిధుల కొరత, ప్రాజెక్టు బేరింగ్ పనులు తరుచూ మరమ్మతులకు గురవుతుండడంతో శ్రీశైలం సొరంగమార్గం టన్నెల్-1 పనులు నిలిచిపోతున్నాయి. సాగర్ నియోజకవర్గంలో నెల్లికల్ లిఫ్టుతోపాటు డీ-8,9 కాల్వలకు లిఫ్టు ఏర్పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో ప్రధాన ఎజెండాగా మారింది. కాల్వల పరిస్థితి గురించి తెలియజేస్తూ సమస్యలు తీర్చాలని మంత్రి జగదీష్రెడ్డికి రైతులు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. నకిరేకల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశంతో బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఉదయసముద్రం నుంచి నీటిని తోడి సాగునీరు అందించాలనేది ప్రణాళిక. ట్రయల్ రన్ విజయవంతమైనా కాల్వలు పూర్తి కావల్సి ఉంది.
దేవరకొండ/, తిరుమలగిరి(సాగర్)/ నార్కట్పల్లి.
శ్రీశైలం సొరంగమార్గం మొత్తం 43.93కిలోమీటర్లు తవ్వల్సి ఉన్నా 34కిలోమీటర్ల మేర పూర్తయింది. మరో తొమ్మిది కిలోమీటర్లు తవ్వల్సి ఉంది. మన్నెవారిపల్లి టన్నెల్-1 వద్ద టన్నెల్ బేరింగ్మిషన్ ఇటీవల మ రమ్మతులకు గురికావడంతో పనులు మళ్లీ నిలిచిపోయాయి. అక్టోబరు నాటికి బేరింగ్ మిషన్ జర్మనీ నుంచి ప్రాజెక్టు వద్దకు చేరుకుంటే పను లు పున ప్రారంభమవుతాయని ఏఎమ్మార్పీ అధికారులు తెలుపుతున్నా రు. శ్రీశైలం వద్ద నుంచి కూడా తవ్వకం పనులు సంవత్సరంగా నిలిచిపోయాయి. 2005లో రూ.1925 కోట్లతో పనులను ప్రారంభించగా 2010 నాటికి పూర్తి చేయాలనే గడువు విధించారు. ఢిల్లీకి చెందిన జయప్రకాష్ అసోసియేట్ కంపెనీ సొరంగమార్గం ప్రాజెక్టు పనులను చేపట్టిం ది. 2011లో గడువును 2014కు పొడిగించారు. 2014లో మరో మారు 2017 నాటికి గడువు పెంచారు. 2018లో 2021 నాటికి గడువు పెంచారు. తెలంగాణ ప్రభుత్వం 2023 డిసెంబరు నాటికి గడువు పెంచుతూ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా టన్నెల్ బేరింగ్మిషన్ మరమ్మతులకు గురికావడం, జర్మనీ, అమెరికా దేశాల నుంచి పరికరాలను తీసుకురావాల్సి ఉండడంతో ఆలస్యం జరుగుతుండడంతో సొరంగమార్గం పనులకు ఆటంకాలు కలుగుతున్నాయి.
సీఎం హామీకి ఎనిమిదేళ్లు
డిండి ఎత్తిపోతల పథకాన్ని 2015లో సీఎం కేసీఆర్ మర్రిగూడ మండలం శివన్నగూడెం వద్ద రూ.6.190 కోట్లతో ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు. ఈనెల 12తో ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నా రిజర్వాయర్ల కింద భూములు ముంపునకు గురవుతున్న ఎనిమిది గ్రామాల ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పునరావాస ప్రక్రియ పూర్తి చేయలేదు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి ఇస్తారో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికిరాలేదు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడెం, చింతపల్లి, కిష్టరాయన్పల్లి, గొట్టిముక్కల, సింగరాజుపల్లి, ఉల్ఫర, గోకారం, ఇర్విన్ల వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వీటిలో చర్లగూడెంలో 12 టీఎంసీలు, కిష్టరాయన్పల్లిలో 5.7 టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం పనులు జరుగుతుండగా సింగరాజుపల్లి, గొట్టిముక్కల రిజర్వాయర్ పనులే 90శాతానికిపైగా పూర్తయ్యార ుు. మిగతా రిజర్వాయర్ల పనులు ముందుకు సాగడంలేదు.
నిలిచిన పనులు
ఎస్ఎల్బీసీ ఓపెన్కెనాల్, పెండ్లిపాకల ఎత్తుపెంపు రిజర్వాయర్ల పనులను 2014లో ప్రారంభించగా ఇప్పటివరకు 40శాతం మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో ఓపెన్కెనాల్ పనులు నిలిచిపోయాయి..
నిలిచిన నక్కలగండి రిజర్వాయర్ పనులు
నక్కలగండి రిజర్వాయర్ పనులు 92 శాతానికి పైగా పూర్తయ్యాయి. మరో 8 శాతం పనులు జరగవలసి ఉండగా ఆర్అండ్ఆర్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. నక్కలగండితండా, కేశ్యతండా, మురుపునూతల భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ అందాల్సి ఉంది. పనులు ముం దుకు సాగకపోవడంతో రైతులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్ధాలైనా మోక్షం లేని డీ-8, 9 కాల్వలు
తిరుమలగిరి(సాగర్): అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని అందించేందుకు 15 ఏళ్ల క్రితం కాల్వలు తవ్వినా నేటికీ చుక్క నీరు పారని పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీరు పారలేదు. రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్ హయాంలోనూ పొలాల్లోకి సాగునీటిని పారించుకోలేని పరిస్థితి. 2000 సంవత్సరంలో ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నుంచి డీ-8, 9 ద్వారా వరద నీటిని పారించేందుకు 34కి.మీ మేర కాల్వలు తవ్వారు. నీటి వినియోగం ప్రాజెక్టుకు సమీప గ్రామాల రైతులు వరద నీటిని వరి పంటలు వేసుకోవడానికి వినియోగించడంతో చివరి భూములకు సాగునీరు అందడం లేదు. 2017లో అప్పటి ఎమ్మెల్యే జానారెడ్డి సాగునీటిశాఖ ఇంజనీర్లతో పనులను పర్యవేక్షించగా దానికి పోటీగా తమ ప్రభుత్వమే ఆ పనులను పూర్తి చేస్తుందంటూ సమ్మక్కసారక్క స్టేజీ నుంచి పూల్యా తండా లోలెవల్ కెనాల్ వరకు నోముల నర్సింహయ్య, ఎంసీ. కోటిరెడ్డిలు రైతులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేసి లిఫ్టుకు హామీ ఇచ్చారు. అయితే 2018లో మంత్రి జగదీ్షరెడ్డి చివరి భూముల రైతుల సమస్యలను తెలుసుకునేందుకు కాగా రైతులు డీ-8, 9 కాల్వల పరిస్థితి గురించి తెలియచేస్తూ సమస్యలు తీర్చాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. సాగర్ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్ 2021 ఏప్రిల్ 14న ఎర్రచెర్వు తండా వద్ద నెల్లికల్తోపాటు డీ-8, 9 లిఫ్టుతోపాటు మరో 10 లిఫ్టులకు శంకుస్తాపన చేశారు. డీ-8,9 కాల్వలకు నీరందించే లిఫ్టుకు సంబంధించి పనులకు రూ.2.47కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు పూర్తి చేసేందుకు కేవలం మూడు నెలల సమయంలో పూర్తయ్యే అవకాశం ఉన్నా నేటికీ సకాలంలో పనులను పూర్తి చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, సంబంధితశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక రైతులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాల్వలు పూర్తయ్యేదెన్నడు..
నార్కట్పల్లి మండలంలోని బీ.వెల్లెంలలో ఉయద సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైం ది. లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైనా కాల్వలు ఎప్పటికి పూర్తవుతాయోనని రైతుల్లో ప్రశ్న మెదులుతోంది. నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని 8 మండలాల పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుతో పాటు 127 గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును రూపొందించారు. నల్లగొండ మండలంలో 24,496 ఎకరాలు, మునుగోడులో 10,270, నార్కట్పల్లిలో 33,773, చిట్యాలలో 5,595, రామన్నపేటలో 2,496, శాలిగౌరారంలో 2,784, కట్టంగూర్ మండలంలో 20,614 ఎకరాలకు సాగు నీరందించేలా ప్రణాళిక రూపొందించారు. 3.665 కి.మీల నిడివితో రిజర్వాయర్ కట్ట(బండ్) నిర్మాణాన్ని పూర్తిచేశారు. కాగా 6.5 కి.మీల నిడివి గల ప్రధాన ఎడమ కాల్వ(ఎల్ఎంసీ) ద్వారా సుమారు 43,000 ఎకరాలకు నీరందించనున్నారు. 18 కిలోమీటర్ల మేర డిస్ర్టిబ్యూటరీలను ఏర్పాటు చేయనున్నారు. 26.50 కి.మీల నిడివి గల కుడి కాలువ (ఆర్ఎంసీ) ద్వారా 57,000ల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా పథకం రూపొందించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన భూ సేకరణే అసలు సమస్యగా మారింది. 2017 వరకు కూడా అసలు కావలిసిన భూ సేకరణ నిలిచిపోయింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి 3864 ఎకరాలు అసరముంది. వీటిలో ఇప్పటి వరకు కేవలం 1200 ఎకరాల భూమి మాత్రమే సేకరించగా ఇంకా 2600 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వీటిలో ప్రస్తుతం 1200 ఎకరాల భూ సేకరణ విఽవిధ దశల్లో ఉంది. ప్రాజెక్టు మొత్తం భూ సేకరణలో ఎడమ కాల్వ కోసం వెయ్యి ఎకరాలు, కుడి కాల్వ కోసం1800 ఎకరాలు, రిజర్వాయర్ కోసం 520 ఎకరాలు పోగా మిగతా 544 ఎకరాల్లో పంప్హౌస్, స్విచ్యార్డ్, సర్జ్పూల్, టన్నెల్, అప్రోచ్ కెనాల్లు ఉన్నాయి.