క్రషర్మిల్లును నిలిపే వరకు ఆందోళన చేస్తాం
ABN , First Publish Date - 2023-01-15T00:25:18+05:30 IST
పెద్దగుట్ట పేలుళ్ల క్రషర్ నిర్వహణ నిలిపివేసే వరకు ఆందోళన చేస్తామని వివిధ పార్టీల నాయకులు తెలిపారు.
ఆత్మకూర్(ఎస్), జనవరి 14: పెద్దగుట్ట పేలుళ్ల క్రషర్ నిర్వహణ నిలిపివేసే వరకు ఆందోళన చేస్తామని వివిధ పార్టీల నాయకులు తెలిపారు. నాయకులపై దాడికి పాల్పడిన పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ, సీపీఐఎంఎల్, న్యూడెమోక్రసీ నాయకులు మండలకేంద్రంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలకేంద్రంలో పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి ఇష్టానుసారంగా పెద్ద గుట్టపై బ్లాస్టింగ్ చేపడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ మిల్లును నడుపుతున్నారని ఆరోపించారు. హైకోర్టులో స్టే ఉన్నా దొడ్దిదారిన తప్పుడు అనుమతులు పొందారన్నారు. రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్న తమపై సత్యనారాయణరెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నత అధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ చెప్పడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డేగల వెంకటకృష్ణ, తంగేళ్ల వీరారెడ్డి, పందిరి రాంరెడ్డి, కందాల వెంకటరెడ్డి, కరుణాకర్రెడ్డి, ప్రతాపరెడ్డి, పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు.