నిషేధిత జాబితా నుంచి తొలగాలంటే ఖర్చు తప్పదు!

ABN , First Publish Date - 2023-03-19T00:15:56+05:30 IST

గుట్ట తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.

నిషేధిత జాబితా నుంచి తొలగాలంటే ఖర్చు తప్పదు!
యాదగిరిగుట్ట తహసీల్దార్‌ కార్యాలయం

యాదగిరిగుట్ట తహసీల్దార్‌ కార్యాలయంలో కొందరి తీరు

యాదగిరిగుట్ట రూరల్‌, మార్చి 18: గుట్ట తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ని నిషేధిత భూముల జాబితాలో ఎవరి భూమి చేరినా అది తొలగాలంటే జేబులు ఖాళీ కావాల్సిందే! విలువైన భూములు నిషేధిత జాబితాలో ఉంటే కొందరికి అది కాసులపంటే! నిషేధిత భూములు జాబితా నుంచి పట్టా భూములను తొలగించడానికి కొందరు లక్షలాది రూపాయాలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు లున్నాయి.

పాత భూములు రికార్డులు అవసరం అయితే....

తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పాత రికార్డులు అవసరమైతే అది దళారులకు వరంగా మారుతోంది. పహనీల ద్వార పాత రికార్డు ఇవ్వాలంటే రూ. వేయి నుంచి రూ.ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు. భూముల రిజిస్ర్టేషన్‌ విషయంలోనూ ముడుపులు షరా మాములేనన్న అభియోగాలు వస్తున్నాయి. భూముల రిజిస్టేషన్‌ పూర్తి అయిన తరువాత రూ. 500నుంచి రూ.రెండు వేల వరకు కొందరు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిటికేషన్‌ భూములకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పట్టాలు పూర్తి చేసేందుకు రూ.లక్షల్లో చేతులు మారుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

సర్టిఫికెట్ల జారీకి..

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు అంటూ అవినీతి పరులు సకల జనులకు ఆశలుచూపి వసూల్‌ దందా చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. దరఖాస్తూ అప్లై చేసి రూ.వేయి నుంచి 5వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. జనన, మరణ, ధ్రువీకరణ పత్రాలు సైతం అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. ఆర్డీవో ద్వారా వారికి ఇప్పించడానికి రూ.500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నారు. పూర్తి అయిన పహానీలు, ఇతర ధ్రువీకరణ పత్రాలపై తహసీల్దార్‌ ముద్ర వేయడానికి ఒక్క ధ్రువీకరణ పత్రంపై ముద్ర వేస్తే రూ.100నుంచి ఎక్కువ ఎన్ని పత్రాలు ఉంటే అన్ని వందలు వచ్చిన కాడికి కొందరు వసూళ్లు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఎకరానికి లక్ష వసూలు

షేధిత భూముల జాబితాలో భూమి ఉంటే దాని నుంచి తొలగించి పట్టాలు ఇస్తే భూముల ధరలను బట్టి ఎకరానికి రూ. లక్ష, 2ఎకరాలు ఉంటే రూ. 2లక్షల రూపాయాలు ఇవ్వాల్సిందే. తహసీల్దార్‌ కార్యాలయంలో మొత్తం అవినీతి కంపుకొడుతోంది. సంబందిత అధికారులపై జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలి.

-బబ్బూరి పోశెట్టి, సీపీఎం మండల కార్యదర్శి, యాదగిరిగుట్ట

డబ్బుల వసూళ్లు మా దృష్టికి రాలేదు

మా కార్యాలయంలో నిషేధిత భూములు, పహనీలు, లిటిగేషన్‌ భూముల విషయంలో ఎవరి వద్దా మా సిబ్బంది డబ్బులు తీసుకుంటున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనాసరే అవినీతికి పాల్పడినట్లు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

-రాము, తహసీల్దార్‌, యాదగిరిగుట్ట

Updated Date - 2023-03-19T00:15:56+05:30 IST