శాస్త్రోక్తంగా నిత్య తిరుకల్యాణం
ABN , First Publish Date - 2023-09-22T00:25:53+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి
యాదగిరిగుట్ట, సెప్టెంబరు21: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. ప్రధానాలయ దక్షిణ దిశలోని అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, ముత్యాలు, బంగారు, వజ్రాభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు గజవాహన సేవలో తీర్చిదిద్ది మేళతాళాలు, వేదమంత్ర పఠనాల నడుమ సేవోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి విశ్వక్సేనుడికి తొలి పూజలతో కల్యాణతంతు కొనసాగింది. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనులకు అర్చకులు స్వామివారి శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ముందుగా సుదర్శన శతక పఠనంతో హోమం కొనసాగింది. ప్రభాతవేళ గర్భాలయంలోని స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకస్వాములు నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు, యా గశాలలో నిత్య రుద్రహవనం, వినాయక నవరాత్రి వేడుకలు శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.19,82,890ల ఆదాయ సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.