సీఎం పర్యటనకు పేట ముస్తాబు
ABN , First Publish Date - 2023-08-19T00:59:36+05:30 IST
సీఎం కేసీఆర్ పర్యటనకు సూర్యాపేట ముస్తాబైంది. సీఎం కేసీఆర్ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
బహిరంగ సభ విజయవంతానికి క్షేత్రస్థాయిలో సమావేశాలు
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
సూర్యాపేట, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ పర్యటనకు సూర్యాపేట ముస్తాబైంది. సీఎం కేసీఆర్ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. వీటి ప్రారంభోత్సవం అనంతరం సుమారు రెండు లక్షల మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జన సమీకరణకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూర్యాపేట నియోజకవర్గంలోని మండలాలు, పట్టణాల బాధ్యతలను అప్పగించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిద్దిద్దారు. రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతు చేశారు. సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ కార్యాలయాలకు నూతనంగా రోడ్లు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన విజయవంతానికి ఏర్పాట్లను మంత్రి జగదీ్షరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
జాతీయస్థాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్
సూర్యాపేటలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైనది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సామర్ధ్యాన్ని పెంచేందుకు ఈ మార్కెట్ను నిర్మించారు. సుమారు రూ.30కోట్లతో 2.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మార్కెట్ను నిర్మించారు. ఆరుఎకరాల విస్తీర్ణంలో ఐదు బ్లాకుల్లో 200 దుకాణాలు నిర్మించారు. ఈ మార్కెట్లో రోజుకు 9 నుంచి 10గంటల పాటు స్కైషేడ్తో పగటి వెలుగు ప్రసరించేలా ఏర్పాటుచేశారు. దేశంలోనే ఈ తరహా మార్కెట్ నిర్మాణం సూర్యాపేటలోనే ప్రథమం కావడం విశేషం. మార్కెట్లోని దుకాణాల్లో విద్యుత్ లైట్లు అవసరం లేకుండా పగటి వేళల్లో స్కైషేడ్ ద్వారా వెలుతురు ప్రసారం అవుతుంది. ఈ మార్కెట్లో పండ్లు, పూలు, మటన్, చికెన్, కూరగాయలు, చేపలతో పాటు ఇంకా పలు రకాల వస్తువులు ఒకే చోట లభించేలా నిర్మించారు.
రూ.65కోట్లతో సమీకృత కలెక్టరేట్ భవనం
జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సుమారు రూ.65కోట్లతో నిర్మించారు. 21ఎకరాల్లో 1.25లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. జిల్లాలోని 37 ప్రభుత్వ శాఖలన్నీ ఈ భవనంలోనే కొనసాగనున్నాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్లు, మీటింగ్ హాల్తో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా నిర్మించారు. కార్యాలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో రెండు అంతస్తుల్లో నిర్మించారు. కలెక్టరేట్లో పచ్చదనానికి అధిక ప్రాధా న్యం ఇచ్చారు. ప్రాంగణంలో సుమారు 70రకాల మొక్కలు నాటారు. అంతేగాక హెలీప్యాడ్ను నిర్మించారు. కలెక్టరేట్కు విద్యుత్కు బదులు సోలార్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేశా రు. సుమారు రూ.65లక్షలతో వంద కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ ఎనర్జీ సిస్టమ్ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కలెక్టరేట్కు మిషన్ భగీరథ నీటిని అందించనున్నారు. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మిషన్ భగీరథ నీటినే వినియోగించనున్నారు. అందుకు కలెక్టరేట్ సముదాయం వద్ద 1.20లక్షల లీటర్ల సామర్ధ్యంతో ట్యాం కులు నిర్మించారు. ఈ ట్యాంకులకు ఖమ్మం రోడ్డులోని మిషన్ భగీరథ ట్యాంక్ నుంచి పైప్లైన్ ఏర్పాటుచేశారు.
భారీ బందోబస్తు
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పేటలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు పర్యవేక్షణలో సుమారు 3వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. సీఎం పట్టణంలో సుమారు 22కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. సీఎం బహిరంగ సభతో పాటు ఐదు కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేయనుండటంతో బందోబస్తుకు అధిక సంఖ్యలో పోలీసుల అవసరం ఏర్పడింది. సీఎం హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చేరుకుని వాటిని ప్రారంభిస్తారు. అనంతరం జనగాం క్రాస్ రోడ్డు నుంచి జాతీయ రహదారి మీదుగా సమీకృత కలెక్టరేట్కు చేరుకొని ప్రారంభిస్తారు. అక్కడే అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించి భోజనం చేస్తారు. అనంతరం నూతన వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వద్దకు రోడ్డు మార్గంలో ఖమ్మం క్రాస్ రోడ్డు మీదుగా చేరుకుంటారు. సభ అనంతరం రోడ్డు మార్గంలో పాత వ్యవసాయ మార్కెట్కు చేరుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రారంభిస్తారు. బందోబస్తుకు పోలీసులు పట్టణాన్ని 10 సెక్టార్లుగా విభజించా రు. ఏడుగురు అదనపు ఎస్పీలు, 24మంది డీఎస్పీలు, 95 మంది సీఐలు, 300మంది ఎస్ఐలు, 400మంది ఏఎ్సఐ లు, హెడ్కానిస్టేబుళ్లు, 1300మంది కానిస్టేబుళ్లు, 130 మంది మహిళా సిబ్బంది, 350మంది హోంగార్డులు, ఆరు రోప్ పార్టీలు, ఎనిమిది బాంబ్ స్క్వాడ్స్, ఐదు డాగ్ స్క్వా డ్స్, 19 స్పెషల్ పార్టీలు బందోబస్తు నిర్వహిస్తాయి.
అత్యాధునిక టెక్నాలజీతో జిల్లా పోలీస్ కార్యాలయం
సూర్యాపేటలో అత్యాధునిక టెక్నాలజీతో పోలీస్ కార్యాలయాన్ని నిర్మించారు. సుమారు 20ఎకరాల విస్తీర్ణంలో రూ.38.50కోట్లతో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని నిర్మించారు. భవనాన్ని మూడు అంతస్తుల్లో సుమారు 60వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. ఎస్పీ, అదనపు ఎస్పీ కార్యాలయాలతో పాటు ఇతర విభాగాలకు సంబంధించి కార్యాలయాలు ఇక్కడే కొనసాగనున్నాయి. కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
రూ.156కోట్లతో మెడికల్ కళాశాల
జిల్లా కేంద్రంలో రూ.156కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను 20ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కళాశాలను నిర్మించా రు. వెయ్యి మంది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలు,ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బందికి వేర్వేరు గా వసతి భవనాలు నిర్మించారు. గ్రౌండ్ఫ్లోర్తో కలిసి నా లుగు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించారు. కళాశాల ప్రాంగణంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం సిద్ధం
జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సుమారు రూ.60లక్షలతో నిర్మించారు. జిల్లా పోలీస్ కార్యాలయం పక్కన సుమారు నాలుగు ఎకరాల్లో దీన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో అంతస్తులో కార్యాలయం, సమావేశ మందిరాన్ని నిర్మించారు.
సభ ఏర్పాట్లు అద్భుతంగా ఉండాలి : మంత్రి
సూర్యాపేట(కలెక్టరేట్):సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లన్నీ అద్భుతంగా ఉండాలని మంత్రి జగదీ్షరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగవద్దన్నారు. సభాస్థలికి ప్రజలు చేరుకునేందుకు అవసరమైన రోడ్లను నిర్మించాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులపై గుంతలు ఏర్పడ్డాయని, వాటిని వెంటనే పూడ్చివేయాలన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ నాయకులు గండూరి ప్రకాష్, వల్దాస్ జానీ, సుంకరి రమేష్, శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, తదితరులు ఉన్నారు.