ఉప ఎన్నికలకు నోచని పంచాయతీలు
ABN , First Publish Date - 2023-12-11T00:02:09+05:30 IST
పలు కారణాలతో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల వివరాలను ఏడాదిన్నర క్రితం అధికారులు నివేదించినా, ప్రభుత్వం ఉప ఎన్నికలు నిర్వహించలేదు. గ్రామ పాలనలో పంచాయతీ పాలకవర్గాలు కీలకం.
ఏడాదిన్నర క్రితం ఖాళీల వివరాల అందజేత
తాజాగా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తెరపైకి ఎన్నికలకు కసరత్తు
50 రోజుల్లో గద్దె దిగనున్న పాలకవర్గాలు
భువనగిరి రూరల్,డిసెంబరు10: పలు కారణాలతో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల వివరాలను ఏడాదిన్నర క్రితం అధికారులు నివేదించినా, ప్రభుత్వం ఉప ఎన్నికలు నిర్వహించలేదు. గ్రామ పాలనలో పంచాయతీ పాలకవర్గాలు కీలకం. అలాంటి ది చాలా పల్లెల్లో పూర్తిస్థాయి పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనుల నిర్వహణ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖాళీలు ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాలని గ్రామస్థులు ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించింది. తాజాగా, ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల కు ఆదేశాలు జారీ చేయగా, అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు 2019 జనవరిలో నిర్వహించారు. పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 1తో ముగియనుంది. మరో 50 రోజుల్లో పాలక వర్గాలు గద్దె దిగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, జిల్లాల పరిధిలో మొ త్తం1,740 గ్రామ పంచాయతీలు, 15,328వార్డులు ఉన్నాయి. కాగా,ఉమ్మడి జిల్లాలో 30 సర్పంచ్, 1,162 వార్డు సభ్యుల స్థానాలు పలు కారణాలతో ఖాళీగా ఉన్నాయి. పదవులకు రాజీనామా చేయడం, పదవిలో ఉండగా మృతి చెందడం వంటి కారణాలతో నల్లగొండ జిల్లాలో 22, సూర్యాపేట జిల్లాలో నాలుగు, యాదాద్రి జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రజాప్రతినిధి లేకపోవడం తో ఆయా చోట్ల పంచాయతీ కార్యదర్శులే అన్నీ తామే పాలనను నడిపిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఖాళీలు ఇలా..
జిల్లా పంచాయతీలు సర్పంచ్ వార్డు
ఖాళీలు ఖాళీలు
నల్లగొండ 844 22 772
సూర్యాపేట 475 4 234
యాదాద్రి 421 4 156
మొత్తం 1,740 30 1,162