చెర్వుగట్టులో పార్వతీదేవికి పల్లకి సేవ

ABN , First Publish Date - 2023-01-15T00:41:59+05:30 IST

మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పార్వతీ అమ్మవారికి శనివారం పల్లకిసేవ నిర్వహించారు.

చెర్వుగట్టులో పార్వతీదేవికి పల్లకి సేవ
అమ్మవారిని పల్లకిసేవలో గుట్టపైకి తీసుకెళ్తున్న అర్చకులు, భక్తులు

నార్కట్‌పల్లి, జనవరి 14: మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పార్వతీ అమ్మవారికి శనివారం పల్లకిసేవ నిర్వహించారు. ఈనెల 28వ తేదీ నుంచి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో గుట్ట కింద కొలువై ఉన్న పార్వతీ అమ్మవారి ఉత్సవ మూర్తిని ఏటా భోగి పండుగ రోజున పులుగం నైవేద్యం ప్రసాద వితరణ అనంతరం పల్లకిసేవలో గుట్టపైకి చేర్చడం చెర్వుగట్టు క్షేత్రంలో అనాదిగా వస్తున్న ఆచారం. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి రోజున నిర్వహించే పార్వతీ పరమేశ్వరుల కల్యాణం సందర్భంగా గుట్ట కింద దేవాలయంలో కొలువైన పార్వతీ అమ్మవారి ఉత్సవమూర్తిని దేవస్థాన ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సహార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ వేడుకలో దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-15T00:42:00+05:30 IST