పకడ్బందీగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు
ABN , First Publish Date - 2023-08-02T00:32:39+05:30 IST
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి తెలిపారు.
యాదాద్రి, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని, పలు పథకాలను ప్రవేశపెడుతుందని, ఈ సంక్షే మ ఫలాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంటుందన్నారు. ప్రభుత్వం రెండో విడత దళితబంధు, బీసీ, మైనార్టీలకు రూ.లక్షతోపాటు గృహలక్ష్మీ, తదితర సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు సన్నద్ధమవుతుందని, ఈ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పక్కాగా అమలు చేస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై సంబంధిత శాఖలతో సమీక్షించి, ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సాధారణ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారులకు త్వరలోనే హైదరాబాద్లో శిక్షణ ఇస్తుందన్నారు. ఓటరు జాబితా, పోలింగ్స్టేషన్లు, ఓటింగ్ యంత్రాలు, తదితర సామగ్రి, ఎన్నికల విధులపై అధికారులతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్
భువనగిరి అర్బన్: జిల్లా కలెక్టర్గా టి.వినయ్కృష్ణారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా జీఏడీ నుంచి ఆయన జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ను రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీ.వీరారెడ్డి, భువనగిరి ఆర్డీవో అమరేందర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డికి కూడా అధికారులు స్వాగతం పలికారు.