శివకేశవులకు ఘనంగా నిత్యారాధనలు
ABN , First Publish Date - 2023-03-28T00:21:06+05:30 IST
: ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శివకేశవులకు నిత్యారాధనలు ఘనంగా కొనసాగాయి.
సంప్రదాయరీతిలో వసంత నవరాత్రి వేడుకలు
యాదగిరిగుట్ట, మార్చి 27: ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శివకేశవులకు నిత్యారాధనలు ఘనంగా కొనసాగాయి. వైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో పంచనారసింహుడిని, శివాలయంలో రామలింగేశ్వరస్వామిని శైవాగమ పద్ధతిలో ఆరాదించారు. సుదర్శన హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరస్వామిని, మహామండపంలో స్ఫటికమూర్తులను రుద్ర, నమక, చమక, పంచసూక్తాలతో పంచామృలతో అభిషేకించి, బిళ్వపత్రాలతో అర్చించారు. అనంతరం శివపార్వతులను దివ్యమనోహరంగా అలంకరించి తిరువీధి సేవోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాకార మండపంలో శివపార్వతుల కల్యాణోత్సవ పర్వాలను స్మార్త సంప్రదాయరీతిలో నిర్వహించారు. సాయంత్రం వేళ శివపార్వతులను సేలో తీర్చిదిద్దిన పూజారులు తిరువీధి సేవోత్సవం నిర్వహించారు. శివాలయంలో వసంత నవరాత్రి వేడుకల్లో భాగంగా సీతారామచంద్రస్వామిని కొలిచిన అర్చకులు యాగశాలలో మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలు, వేదపారాయణ పఠనం చేశారు. వివిధ విభాగాల ద్వారా రూ.33,02,497 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.
ఉప ప్రధానార్చకుడిగా పదోన్నతి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ముఖ్య అర్చకులుగా విధులు నిర్వర్తిస్తున్న పరాంకుశం భాస్కరాచార్యులు ఉపప్రధానార్చకులుగా పదోన్నతి పొందారు. సోమవారం ఆయనకు పదోన్నతి పత్రాన్ని దేవస్థాన ప్రఽధానకార్యాలయంలో ఈవో గీతారెడ్డి అందజేశారు. పదోన్నతి పొందిన భాస్కరాచార్యులును దేవస్థాన సిబ్బంది, అర్చకబృందం, యాదగిరిగుట్ట శ్రీవైష్ణవ సేవా సమాఖ్య సభ్యులు అభినందించారు.