తప్పనిసరిగా బిల్లు అడిగి తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-03-19T00:26:51+05:30 IST
ప్రతి వస్తువు కొనుగోలుకు వినియోగదారులు బిల్లు అడిగి తీసుకోవాలని జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతీ దేవి అన్నారు. వినియోగదారుల సంక్షేమ చట్టం, వ్యవసాయ దారులకు ఆర్థికసహాయం, రుణాలపై ఆర్బీఐ మార్గదర్శకాలపై శనివారం భువనగిరిలో కోర్టులో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు.
మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి మారుతీ దేవి
భువనగిరి టౌన్, మార్చి 18: ప్రతి వస్తువు కొనుగోలుకు వినియోగదారులు బిల్లు అడిగి తీసుకోవాలని జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.మారుతీ దేవి అన్నారు. వినియోగదారుల సంక్షేమ చట్టం, వ్యవసాయ దారులకు ఆర్థికసహాయం, రుణాలపై ఆర్బీఐ మార్గదర్శకాలపై శనివారం భువనగిరిలో కోర్టులో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఆర్బీఐ మార్గదర్శక సూత్రాలను వ్యాపారులు, రైతులు పాటించాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించాలన్నారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి బి నాగేశ్వర్రావు మాట్లాడుతూ హక్కులు, బాధ్యతలపై వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని, వినియోగదారుల హక్కుల చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలుపై నష్టం జరిగినా, నాణ్యత లోపించినా ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం నిర్వహించిన బ్యాంక్ లోక్ అదాలత్లో యూబీఐ బ్యాంకుకు చెందిన 23 ప్రీ లిటిగేషన్ కేసులను రాజీ రూపంలో పరిష్కరించి రూ.2.23లక్షలు బకాయిదారుల నుంచి బ్యాంకు ఖాతాలో జమ చేయించారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘం కార్యదర్శి జంపాల అంజయ్య, యూబీఐ చీఫ్ మేనేజర్ ఉత్పల్కుమార్, మేనేజర్ భరత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.కేశవరెడ్డి, ప్రభుత్వ న్యాయవాధి ఎన్ అంజయ్య, లోక్ అదాలత్ సభ్యులు జి నాగేంద్రమ్మ, బాలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.