రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2023-02-07T01:32:45+05:30 IST
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చివ్వెంల ఏఎస్ఐ జి.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం..
చివ్వెంల, ఫిబ్రవరి 6: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. చివ్వెంల ఏఎస్ఐ జి.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం హుస్సేనాబాద్ గ్రామానికి చెందిన అక్కినపల్లి దశరథ(38) సొంత పనుల కోసం ద్విచక్రవాహనంపై ఆదివారం రాత్రి సూర్యాపేటకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని కాట మయ్య గుడి సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ దశరథ బైక్ను అతి వేగంతో ఢీకొట్టి, పైనుంచి లారీ దూసుకువెళ్లింది. ఈప్రమాదంలో దశరథ అక్కడి క్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
కాల్వలో పడి..
గరిడేపల్లి: మండలంలోని ఎల్బీనగర్ పరిధిలో ఉన్న నాగార్జున సాగర్ 10వ నంబరు కాల్వలో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం మైలవరానికి చెందిన షేక్ ఇమ్రాన్ (20) నాలుగు రోజుల క్రితం నేరేడుచర్ల మండల కేంద్రం లోని తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చాడు. సోమవారం బంధువులతో కలిసి ఎల్బీ నగర్ కాల్వ దగ్గరికి వచ్చారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయాడు. ఈత రాక పోవడంతో కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి కొట్టుకుపోతున్న ఇమ్రాన్ను బయటకు తీసి నేరేడు చర్లలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.