కనుల పండువగా ఉమామహేశ్వర కల్యాణ మహోత్సవం
ABN , First Publish Date - 2023-02-21T00:27:28+05:30 IST
మర్కుక్ మండల పరిధిలో అంగడి కిష్టాపూర్ గ్రామంలో గల ఉమామహేశ్వర ఆలయంలో కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
జగదేవ్పూర్, ఫిబ్రవరి 20 : మర్కుక్ మండల పరిధిలో అంగడి కిష్టాపూర్ గ్రామంలో గల ఉమామహేశ్వర ఆలయంలో కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపం వరకు ఎదుర్కోలు నిర్వహించారు అనంతరం కల్యాణ మండపంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. సోమవారం ఈ కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ధర్మ కర్త కప్పర శైలజా మోహన్ రావు దంపతులు నిర్వహించగా, అలయ కమిటీ చైర్మన్ బల్లి శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ దుద్దెడ లక్ష్మీరాములు గౌడ్, ఎంపీటీసీ గోలి నరేందర్, ప్రధాన అర్చకులు వెంకట నర్సింహశర్మ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కల్యాణానికి ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవ మండపాన్ని వివిధరకాల పూలతో విశ్వకర్మ సంఘం మండలాధ్యక్షుడు కంది నరసింహాచారి అధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండల్రెడ్డి, ఆలయకమిటీ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎర్రబాగు ఆశోక్, మాధవి రాజిరెడ్డి, మంజుల శ్రీరాములు, మొండి భాగ్యభిక్షపతి, జవహర్నగర్ కార్పొరేటర్ బల్లి రోజా శ్రీనివాస్గుప్తా, పీఆర్టీయూ మర్కుక్ మండలాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు తదితరులున్నారు.
కుకునూరుపల్లిలో..
కొండపాక: కుకునూరుపల్లిలోని ఉమామహేశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని సోమవారం శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.