కొత్త మండలంగా తడ్కల్‌!

ABN , First Publish Date - 2023-09-05T00:24:07+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా తడ్కల్‌ కేంద్రంగా మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

కొత్త మండలంగా తడ్కల్‌!

అభిప్రాయ సేకరణకు 15రోజులు గడువు

నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 4 : సంగారెడ్డి జిల్లాలో కొత్తగా తడ్కల్‌ కేంద్రంగా మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రస్తుతం నారాయణఖేడ్‌ డివిజన్‌లోని కంగ్టి మండలంలో ఉన్న తడ్కల్‌ను మండలంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉన్నది. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి కోరిక మేరకు కంగ్టి మండలంలో ప్రస్తుతమున్న 33 గ్రామాల నుంచి 15 గ్రామాలను వేరుచేసి తడ్కల్‌ కేంద్రంగా కొత్తమండలం ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా గెజిట్‌లో ప్రచురించి, మండలం ఏర్పాటుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్‌ శరత్‌ను ఆదేశించారు. పదిహేను రోజుల్లో మండలం ఏర్పాటుపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో రాత పూర్వకంగా జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలని కోరారు.

తడ్కల్‌లో సంబరాలు

కంగ్టి, సెప్టెంబరు 4: తడ్కల్‌ను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. తడ్కల్‌లో పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. ప్రజల డిమాండ్‌పై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సంబరాల్లో జడ్పీటీసీ లలిత ఆంజనేయులు, ఎంపీపీ సంగీత వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ మనోహర్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-05T00:24:07+05:30 IST