స్పోర్ట్స్ హబ్గా సిద్దిపేట
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:13 AM
పట్టణంలోని మినీ స్టేడియంలో 16 రకాల జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడలు ఆడేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేయడంతో సిద్దిపేట స్పోర్ట్స్ హబ్గా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
విద్యతో పాటు క్రీడలూ ముఖ్యమే
ఆటలు అదుర్స్ అనేలా అన్ని వసతులు కల్పించాం
ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ పుట్బాల్ పోటీల
ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు
పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
సిద్దిపేటలో ఫెడరల్ బ్యాంకు ప్రారంభం
సిద్దిపేటటౌన్, డిసెంబరు 28: పట్టణంలోని మినీ స్టేడియంలో 16 రకాల జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడలు ఆడేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేయడంతో సిద్దిపేట స్పోర్ట్స్ హబ్గా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని ఫుట్బాల్ స్టేడియంలో ఇంటర్ స్కూల్ డిస్ర్టిక్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేట ఫుట్బాల్ స్టేడియాన్ని అధ్భుతంగా చేసుకున్నామని, అధ్భుతమైన క్రీడను ప్రదర్శించి జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలన్నారు. విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని సూచించారు. అన్నీ జాతీయస్థాయి క్రీడలకు వేదికగా సిద్దిపేట కావడం ఆనందంగా ఉందని తెలిపారు. సిద్దిపేట క్రీడా కాంప్లెక్స్లో మరో రూ. 11కోట్లతో, క్రికెట్ స్టేడియానికి రూ. 4 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. రూ. 50 లక్షలతో వాలీబాల్ స్టేడియాన్ని తయారు చేసుకున్నామని, మరో రూ.50 లక్షలతో స్టేడియాన్ని మరింత ఆధునీకరణ చేయబోతున్నామని చెప్పారు. అనంతరం ఇటీవల జాతీయస్థాయిలో ఎంపికైన జమ్మూకాశ్మీర్లో ఆడిన అబ్దుల్ సమద్ను, రాష్ట్రస్థాయిలో ఎంపికైన శివగణే్షను అభిందించారు. కార్యక్రమంలో నాయకులు రాజనర్సు, పాల సాయిరాం, మల్లికార్జున్, పుట్బాల్ కోచ్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
ఫెడరల్ బ్యాంక్ సిద్దిపేటకు రావడం శుభసూచకం
సిద్దిపేట పట్టణానికి ఫెడరల్ బ్యాంక్ రావడం శుభసూచకమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలో ఫెడరల్ బ్యాంక్ను సిబ్బందితో కలిసి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో అన్ని బ్యాంక్లు అందుబాటులోకి వచ్చాయని స్పష్టం చేశారు. విద్యా, సాగు నీటి, వ్యాపార కేంద్రంగా సిద్దిపేట మారిందని చెప్పారు. వీటిలో సిద్దిపేట పట్టణంలోనే 50 బ్రాంచ్ల వరకు ఉన్నాయన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అనడానికి ఇది నిదర్శనమని, అభివృద్ధి ఎక్కడుంటే వ్యాపారాభివృద్ధి అక్కడ ఉంటుందని, వ్యాపారం ఉంటే అన్ని రకాల బ్యాంకులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సిద్దిపేటలో రూ. 12 వేల కోట్ల వ్యాపారం ఉందని, దీనిలో రూ. 7కోట్ల వరకు బ్యాంక్ లోన్స్, రూ.5కోట్లు వరకు డిపాజిట్లు ఉన్నాయని, మిగతా అంతా వ్యాపారమే ఉందని పేర్కొన్నారు.
సూపర్ టేస్ట్, డైటింగ్ మస్ట్
ఇడ్లీ బాగుందని, డైట్ మెయింటైన్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హరీశ్రావు సూచించారు. బుధవారం రాత్రి సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డులో రోడ్డుపై ఉన్న టిఫిన్ సెంటర్ బండి వద్ద ఆగి యువకులతో మాట్లాడుతూ ఆయన ఇడ్లీ తిన్నారు. పలు యువతీయువకులు హరీశ్రావుతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పరామర్శలు
సిద్దిపేటలో బుధవారం రాత్రి అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట పట్టణంలోని బైపాస్ రోడ్డు హరీశ్రావునగర్లో గల శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గురువారం నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి సమాజం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ రోజారాధాకృష్ణశర్మ కుమార్తె నూతన గృహప్రవేశంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అజయ్ కుటుంబాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు.