విత్తన ధరలు ఖరారు
ABN , First Publish Date - 2023-05-25T22:56:57+05:30 IST
వానాకాలం సీజన్లో రైతులకు సరఫరా చేయనున్న విత్తనాల ధరలను తెలంగాణ రాష్ట్ర విత్తనాల సంస్థ ఖరారు చేసింది.

వానాకాలం అవసరానికి సరిపడా నిల్వలు సిద్ధం
మెదక్, మే 25 : వానాకాలం సీజన్లో రైతులకు సరఫరా చేయనున్న విత్తనాల ధరలను తెలంగాణ రాష్ట్ర విత్తనాల సంస్థ ఖరారు చేసింది. వర్షాకాలం సీజన్కు 15 రకాల వరి వంగడాలను అందుబాటులోకి తెచ్చింది. 25 కిలోల ప్యాకింగ్తో విత్తన బస్తాలను అందించనున్నారు. ఇందులో ‘ఉమ’ వంగడం గత సీజన్ నుంచే రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. కేఎన్ఎం 1638 వంగడం ఈ సీజన్లో మార్కెట్లో ప్రవేశపెట్టారు. పప్పుదినుసుల విత్తనాలు 4 కేజీల బస్తాల్లో లభ్యమవుతాయని సంస్థ ప్రకటించింది. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగు, జనుము విత్తనాలపై ప్రభుత్వం 65 శాతం రాయితీ ఇస్తున్నది. వరి, కంది, పప్పుదినుసులు, మొక్కజొన్న, కుసుమ, నువ్వుల విత్తనాలను రాయితీ లేకుండా పూర్తి ధరతో విక్రయించనున్నారు.
డీసీఎంఎస్, ఆగ్రోస్ సంస్థల ద్వారా సరఫరా
వరి, మొక్కజొన్న, పప్పుదినుసులు, నువ్వులు తదితర విత్తనాలను నేరుగా డీలర్ గుర్తింపు ఉన్న సొసైటీలు, డీసీఎంఎ్సలు, ఆగ్రోస్ సంస్థల ద్వారా పొందవచ్చు. ఈ ఏడాది కొత్తగా ‘కేఎన్ఎం 1638’ వరి వంగడాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 125 రోజుల్లో దిగుబడి వచ్చే ఈ సన్నరకం వరి ప్రయోగాత్మక సాగులో మంచి ఫలితాలు రావడంతో పూర్తిస్థాయి సాగు కోసం రైతులకు సరఫరా చేస్తున్నారు.