నిరుపేద ఇంటిని కూల్చిన సర్పంచ్ కొడుకు
ABN , First Publish Date - 2023-05-31T23:48:23+05:30 IST
నంగునూరు, మే 31: నంగునూరు మండలం వెంకటాపూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మి కుమారుడు కోటిరెడ్డి ఓ నిరుపేద మహిళ ఇల్లును కూల్చేశాడు.
నంగునూరు, మే 31: నంగునూరు మండలం వెంకటాపూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మి కుమారుడు కోటిరెడ్డి ఓ నిరుపేద మహిళ ఇల్లును కూల్చేశాడు. ఈ విషయమై బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మహిళ రంగు మల్లవ్వ గ్రామపంచాయతీ పక్కనే తన సొంత స్థలంలో 20 ఏళ్ల క్రితం రేకుల ఇంటిని నిర్మించుకున్నది. ఇక్కడ బతుకుదెరువు లేకపోవడంతో కొన్నాళ్లు హైదరాబాద్ వెళ్లి కూలీనాలి చేసుకుని బతుకుతున్నది. వారంరోజుల క్రితం మల్లవ్వ గ్రామానికి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షానికి రేకులు పగిలిపోయి, దర్వాజలు చెదలు పట్టి పుచ్చిపోవడంతో మరమ్మతులు చేయించుకుని ఇంట్లో ఉండేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత కోటిరెడ్డి తన అనుచరులతో వచ్చి గ్రామపంచాయతీ డోజర్తో ఇంటిని కూల్చేశాడని తెలిపింది. కోటిరెడ్డి అరాచకాల నుంచి కాపాడాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజగోపాల్పేట ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు.