ఫోర్జరీ డాక్యుమెంట్తో ప్లాటు అమ్మేసిన సర్పంచ్ భర్త
ABN , Publish Date - Dec 29 , 2023 | 11:53 PM
అసలు యజమాని పేరుతో ఫేక్ రిజిస్ట్రేషన్ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పటాన్చెరు పోలీసులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు వెలుగులోకి బీఆర్ఎస్ నేత అంతిరెడ్డి లీలలు
పటాన్చెరు, డిసెంబరు 29: ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి యజమానికి తెలియకుండా ప్లాటును అమ్మేసి బీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ భర్త సొమ్ము చేసుకున్నాడు. న్యాయం చేయాలని బాధితులు శుక్రవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయడంతో జరిగిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చింతలకుంట గ్రామానికి చెందిన కోగంటి రమాదేవి అనే మహిళ పటాన్చెరు మండలం రామేశ్వరంబడ గ్రామంలో సర్వేనంబర్ 183, 184, 185లో చేసిన పంచాయతీ లేఅవుట్లో 350గజాల ప్లాటును కొనుగోలు చేశారు. డాక్యుమెంట్ నంబర్ 8844పేరుతో 1985లో సంగారెడ్డి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ప్లాట్లు అమ్ముడు పోయిన తర్వాత ఏళ్ల తరబడి సదరు లేఅవుట్లో ఇళ్లు నిర్మించకపోవడంతో రామేశ్వరబండ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు, ప్రస్తుత సర్పంచ్ భర్త అంతిరెడ్డి కన్నుపడింది. అసలు యజమాని కోగంటి రమాదేవి పేరుతో గుర్తుతెలియని మహిళ ఫొటో అతికించి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫారం-32 సృష్టించాడు. 1985 ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై యజమానుల ఫొటోలు, గుర్తింపు కార్డులు లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. ప్లాటు యజమాని ప్రతినిధిగా అంతిరెడ్డి స్వయంగా ఫారం-32లో పేర్కొన్నాడు. ఫోర్జరీ సంతకాలు, ఫొటోతో సృష్టించిన ఫారం-32 సహాయంతో ప్లాటు యజమాని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండానే ప్రతినిధి పేరుతో అంతిరెడ్డి 2007లో డాక్యుమెంట్ నంబర్ 11195 (సేల్ కమ్ జీపీఏ) ద్వారా బీహెచ్ఈఎల్ ఎంఐజీకి చెందిన కే.సత్యనారాయణరావు అనే వ్యక్తికి విక్రయించారు. అంతిరెడ్డి ద్వారా జీపీఏ పొందిన సత్యనారాయణ అమీర్పేటలో నివాసం ఉండే వీరారెడ్డి అనే మరో వ్యక్తికి ప్లాటును సేల్ డీడ్ ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారం వెనక ఇంద్రేశం సాయికాలనీలో ఉండే మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి హస్తం ఉందని ప్రచారం జరిగింది. తమ పేర్లమీద నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాటును కబ్జా చేశారన్న విషయం ఇటీవల తెలుసుకున్న బాధితురాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా బీఆర్ఎ్సలో నాయకుడిగా ఉన్న అంతిరెడ్డి భార్యే రామేశ్వరంబండ సర్పంచ్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని బాధితురాలు వాపోయారు. అంతిరెడ్డిపై కేసు నమోదు చేయాలని గతంలో పటాన్చెరు పోలీసులకు పోస్టు ద్వారా పూర్తి డాక్యుమెంట్లను జతచేసి ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని, గరవ్నర్, సీఎం కార్యాలయాన్ని, హైకోర్టు న్యాయమూర్తిని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.