తెలంగాణ దశాబ్ది డాక్యుమెంటేషన్‌కు రాఘవాపూర్‌ పాఠశాల ఎంపిక

ABN , First Publish Date - 2023-05-21T23:47:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు డాక్యుమెంటేషన్‌ ద్వారా తెలియజేయాలని నిర్ణయించింది.

తెలంగాణ దశాబ్ది డాక్యుమెంటేషన్‌కు రాఘవాపూర్‌ పాఠశాల ఎంపిక
రాఘవాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

‘మన ఊరు-మన బడి’ ద్వారా కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలు

సిద్దిపేట రూరల్‌, మే 21: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు డాక్యుమెంటేషన్‌ ద్వారా తెలియజేయాలని నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిని డాక్యుమెంటేషన్‌ రూపంలో ప్రదర్శించనున్నారు. కాగా మన ఊరు-మనబడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గానూ సిద్దిపేట జిల్లాలో పలు పాఠశాలల్లో పూర్తయిన వాటిని గుర్తించారు. అందులో భాగంగా సిద్దిపేట రూరల్‌ మండలం రాఘవాపూర్‌ జిల్లా పరిషత్‌, ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. కాగా రాఘవాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటుకు దీటుగా కనీస వసతులు ఉన్నాయి. విద్యార్థుల కోసం అదనపు తరగతి గదులను నిర్మించారు. అంతేకాకుండా విద్యార్థులు కూర్చోవడం కోసం డ్యూయల్‌ డెస్క్‌లు, వాష్‌ రూమ్‌లు, వంట గదిని అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. భవనాలకు రంగులు వేశారు. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో 150మంది, ప్రాథమిక పాఠశాలలో 170మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఇప్పటికే పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనులను, నిర్వహణ కార్యక్రమాలను వరంగల్‌ విద్యా శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివా్‌సరెడ్డి, సెక్టోరియల్‌ అధికారి రామస్వామి తదితరులు సందర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాట్లను డాక్యుమెంట్‌ రూపంలో సేకరించారు. వీటన్నింటిని డాక్యుమెంటేషన్‌లో చేర్చనున్నారు. తెలంగాణ అవిర్భావ దశాబ్ది ఉత్సవాల డాక్యుమెంటేషన్‌కు తమ పాఠశాల ఎంపికవడం సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ అన్నారు. దీంతో మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-21T23:47:13+05:30 IST