పటాన్‌చెరు కాంగ్రె్‌సలో సమన్వయ లోపం

ABN , First Publish Date - 2023-03-05T00:11:19+05:30 IST

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రె్‌సలో సమన్వయ లోపంపై స్థానిక నాయకులు టీపీసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రేకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

పటాన్‌చెరు కాంగ్రె్‌సలో సమన్వయ లోపం

టీపీసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రేకు నాయకుల ఫిర్యాదు

పటాన్‌చెరు, మార్చి 4: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రె్‌సలో సమన్వయ లోపంపై స్థానిక నాయకులు టీపీసీసీ ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రేకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార బీఆర్‌ఎ్‌సను ఢీకొట్టేందుకు ఐక్యంగా పోరాడాల్సిన సమయంలో గ్రూపు రాజకీయాలతో కిందిస్థాయి క్యాడర్‌లో గందరగోళం నెలకొన్నది. పార్టీ పట్టణ, మండల, మున్సిపల్‌ కార్యవర్గాల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో శనివారం గాంధీభవన్‌లో మాణిక్‌రావ్‌ఠాక్రే సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పటిష్టత, ఎన్నికల వ్యూహాలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రె్‌సలో లోపాలను పటాన్‌చెరు డివిజన్‌ అధ్యక్షుడు కె.నర్సింహారెడ్డి, తెల్లాపూర్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు పర్శ శ్యాంరావు పార్టీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌ ఉన్నా కొందరు నాయకుల కారణంగా సమన్వయ లోపం ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ జోడోయాత్ర పారిశ్రామికవాడలో ఊహించనంత విజయవంతమైందన్నారు. జోడోయాత్ర జోష్‌ను ముందుకు తీసుకెళ్లడంలో నాయకులు విఫలమవుతున్నారని ఆరోపించారు. క్యాడర్‌లో ఉత్సాహం ఉన్నా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనకబడిపోతున్నామని ఫిర్యాదు చేశారు. నియోజవర్గంలో ‘హాత్‌ సే హాత్‌ జోడో’ యాత్ర కేవలం ఒకేరోజు కొనసాగిందని తెలియజేశారు. నియోజకవర్గ ముఖ్య నాయకుల మధ్య గ్రూపువిబేధాలను రూపుమాపి సమన్వయంతో ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలను ఎండగట్టేందుకు కార్యక్రమాలు రూపొందించాలని విన్నవించారు. పీసీసీ ఇన్‌ఛార్జితో పాటు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలజగ్గారెడ్డికి సైతం పార్టీ పరిస్థితిపై ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-03-05T00:11:31+05:30 IST