దుకాణాల్లో న్యూ ఇయర్ సందడి
ABN , Publish Date - Dec 31 , 2023 | 11:11 PM
భారీగా మద్యం, కేకులు, మాంసం అమ్మకాలు
సంగారెడ్డి టౌన్/మెదక్ అర్బన్, డిసెంబరు 31: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలు, బేకరీలు ఆదివారం సందడిగా మారాయి. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత సన్నాహాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైన్స్, బేకరీల్లో భారీగా విక్రయాలు జరిగాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా ప్రజలతో కిక్కిరిశాయి. బిర్యాణీ పాయింట్ నిర్వాహకులు, బేకరీల యజమానులు కేకులకు బంపర్ ఆఫర్లను ప్రకటించి అమ్మకాలు జరిపారు. ఆదివారం రాత్రి 12 గంటల వరకు విందులు, వినోదాలతో ఎంజాయ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం న్యూఇయర్ వేడుకులు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఉదయం నుంచే యువతీ, యువకులు వేడుకల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 దాటగానే పల్లెలు, పట్టణాలు యువత, మహిళలు, పిల్లల కేరింతలతో మార్మోగాయి. ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చి ఒకరికొకరు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ర్టాగ్రామ్ల ద్వారా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దాదాపు గంటసేపు వరకు ఫోన్లన్నీ బిజీగా మారిపోయాయి.