సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవి
ABN , First Publish Date - 2023-08-01T00:24:05+05:30 IST
ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ నాయకుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్యాబినెట్ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకుంది.
గవర్నర్ కోటాలో ఎంపిక చేయాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం
మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు పొడిగింపునకు గ్రీన్ సిగ్నల్
ఊపిరి ఉన్నంత వరకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా : సత్యనారాయణ
పటాన్చెరు, జులై 31: ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ నాయకుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్యాబినెట్ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. నాలుగు దశాబ్దాలుగా పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. 1980లో బీజేపీ మెదక్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సంగారెడ్డి నుంచి ఘన విజయం సాధించారు. నియోజకవర్గ సమస్యలపై, పటాన్చెరులో కాలుష్యం, తాగునీటి వసతి, సింగూరు జలాలపై అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేశారు. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసినా ఓటమి చవిచూశారు. బీజేపీలో జాతీయ గిరిజన మోర్చా ఉపాధ్యక్షుడుగా పనిచేశారు. బీజేపీ అగ్రనేతలు వాజ్పేయ్, అద్వానీ, వెంకయ్యనాయుడు, బంగారులక్ష్మణ్తో ఆయన అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన బీఆర్ఎ్సలో చేరారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తూనే పటాన్చెరు వరకు మెట్రోరైలును పొడిగించాలని ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమించారు. పలుమార్లు సీఎంను కలిసి విన్నవించారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ తాజా క్యాబినెట్ భేటీలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మియాపూర్ నుంచి ఇస్నాపూర్కు మెట్రో లైన్ను పొడిగిస్తూ తీర్మానించారు. సుదీర్ఘ కాలంగా ఎదురు చూసిన అనంతరం ఆయనకు పదవి దక్కడంతో ఆయన వర్గీయులు సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఊపిరి ఉన్నంతవరకు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.