భూ సమీకరణ ఈనెల 10లోగా పూర్తవ్వాలి

ABN , First Publish Date - 2023-01-04T23:14:02+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) ఈనెల 10లోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు.

భూ సమీకరణ ఈనెల 10లోగా పూర్తవ్వాలి

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌

సంగారెడ్డిరూరల్‌, జనవరి4: సంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన భూ సమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) ఈనెల 10లోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డిలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ సమీకరణలు ఈ నెల 10లోగా పూర్తి చేసేలా ఆయా మండల తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా భూ సమీకరణ పూర్తి చేయాలని, ఆయా మండల తహసీల్దార్లు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జీవో 59 కింద ఇచ్చిన దరఖాస్తుల సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, ఆర్డీవోలు నగే్‌షగౌడ్‌, అంబాదాస్‌, కలెక్టరేట్‌ ఏవో మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ అధికారులు మరిన్ని సేవలందించాలి

రెవెన్యూశాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు చేరువై మరిన్ని మెరుగైన సేవలందించాలని కలెక్టర్‌ ఆకాక్షించారు. క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) జిల్లా క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. అందరి సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో మందుంచేలా కృషి చేద్దామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాములు, కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-04T23:14:03+05:30 IST