అధికారం కోసమే కేసీఆర్ మోసపూరిత హామీలు
ABN , First Publish Date - 2023-08-02T00:11:39+05:30 IST
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి ఫైర్ చౌదరిపల్లి, సింగాయిపల్లిలో ఇళ్లను కోల్పోయిన బాధితులకు పరామర్శ
వర్గల్, అగస్టు 1: తెలంగాణలో అధికారం కోసమే సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలు ఇస్తున్నాడని, ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి విమర్శించారు. మంగళవారం వర్గల్ మండలంలోని సింగాయిపల్లి, చౌదరిపల్లి గ్రామాల్లో వర్షానికి ఇళ్లును కోల్పోయిన బాధితులను పరామర్శించారు. వారికి తక్షణ సహాయంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గరకు వస్తున్నందున ప్రజలకు అమలుకు నోచుకోని హామీలు ఇస్తూ సీఎం కేసీఆర్ అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రకటన మోసపూరితమైనదని, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మళ్లీ గెలిపిస్తే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని మాయమాటలు చెబుతాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని డల్లాస్ చేస్తానని కల్లాస్ చేసిండని ఎద్దేవా చేశారు. గ్రామల్లో గుడిసెలు, మట్టి ఇండ్లు లేకుండా చేసి అందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడని దుయ్యబట్టారు. కేసీఆర్ను నమ్మి ఓటు వేసిన గజ్వేల్ ప్రజలు మరోసారి కేసీఆర్ ముఖం చూడబోమని చెబుతున్నారని పేర్కొన్నారు. వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం స్మార్ట్ సిటికి కేంద్ర ప్రభుత్వం రూ.వంద కోట్ల నిధులు విడుదల చేస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ఆ నిధులను కేసీఆర్ తిని కూర్చున్నాడని ఆరోపించారు. స్మార్ట్ సిటీలా వరంగల్ను అభివృద్ధి చేయాల్సింది పోయి శ్మశానంలా మార్చారని మండిపడ్డారు. వర్షాలతో వరంగల్ బురదమయమైందని, కార్లు, ఇళ్లు కొట్టుకపోయాయని చెప్పారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఆయనవెంట బీజేపీ మెదక్ పార్లమెంట్ కన్వీనర్ రాంమోహన్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, జిల్లా అధికార ప్రతినిధి పూదరి నందన్గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీరాం శ్రీకాంత్, బీజేపీ నాయకులు ఉన్నారు.