వేడుకలను బీజేపీ నిర్వహిస్తామనడం విడ్డూరం

ABN , First Publish Date - 2023-06-03T00:20:32+05:30 IST

తెలంగాణను ప్రగతి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్‌దే మంత్రి తన్నీరు హరీశ్‌రావు

వేడుకలను బీజేపీ నిర్వహిస్తామనడం విడ్డూరం
ఎఫ్‌ఢీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి సహకరారంతో దివ్యాంగులకు స్కూటీలను అందజేస్తున్న హరీశ్‌రావు

గజ్వేల్‌, జూన్‌ 2: నాడు కరువుకు నిలయంగా ఉన్న గజ్వేల్‌ నేడు కరువుకు సెలవు ప్రకటించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని ఐఓసీలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. తన జన్మదినం సందర్భంగా గజ్వేల్‌ పట్టణంలోని ఆయా సంఘాలకు స్థలాల కేటాయింపునకు సంబంధించిన ప్రొసీడింగ్‌లను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. అలాగే ఎఫ్‌ఢీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి ఎఫ్‌డీసీ ద్వారా సీఎ్‌సఆర్‌ నిధులతో 60మంది దివ్యాంగులకు సమకూర్చిన స్కూటీలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎలక్షన్లు వస్తున్నందునే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్‌, బీజేపీలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికై పోరాటం చేసింది ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయాలని కోరితే వెన్ను చూపి పారిపోయిన కిషన్‌రెడ్డి కేంద్రప్రభుత్వం ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సాధించుకున్న తెలంగాణను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషిచేసిన ఘనత కేసీఆర్‌దేనని, నాడు వెక్కిరించిన నోళ్లే నేడు పొగుడుతున్నాయని పేర్కొన్నారు. గజ్వేల్‌ నుంచి మరోసారి సీఎంను గెలిపించి, హ్యాట్రిక్‌ సీఎంను చేద్దామని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గజ్వేల్‌ అభివృద్ధిలో ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి కృషి ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టులు, స్థల సేకరణ, స్థలాల కేటాయింపులో వారు పోషించిన పాత్ర గొప్పదని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీ, రైతుబంధు కమిటీ రాష్ట్ర సభ్యులు దేవీరవిందర్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ, మండల అధ్యక్షులు నవాజ్‌మీరా, బెండే మధు, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగ మల్లేశం, ఆత్మ కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ భాస్కర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ భట్టు అంజిరెడ్డి, కౌన్సిలర్లు స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:20:32+05:30 IST