పనిచేయకుంటే వేరే ప్రాంతాలకు వెళ్లండి
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:24 PM
అధికారులకు ఎంపీపీ గిరిధర్రెడ్డి సూచన
జహీరాబాద్, డిసెంబరు 23: పనిచేయడం ఇష్టం లేకుంటే అధికారులు స్వచ్ఛందంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఎంపీపీ అధ్యక్షుడు గిరిధర్రెడి సూచించారు. శనివారం ఎంపీపీ కార్యాలయంలో గిరిధర్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు చెందిన అధికారులు తమ నివేదికలు చదివి వివిపించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోవడం, సమస్యను పరిష్కరించకుండా దాటవేయడంలాంటి కార్యక్రమాలు చేపట్టడాన్ని ఎంపీపీ తప్పుపట్టారు. పని చేయడం ఇష్టం లేకపోతే సెలవులు పెట్టి, లేదా ఇతరత్రాప్రాంతాలకు బదిలీపై వెళ్లాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం వీడితేనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సమావేశానికి రాని అధికారులపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై అధికారులను సభ్యులు నిలదీశారు. తమ గ్రామాల్లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. అనంతరం క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. సమావేశంలో జడ్పీటీసీ నాగిశెట్టిరాథోడ్, ఎంపీడీవో సుమతి, ఎంపీపీ ఉపాధ్యక్షులు రాములు, తహసీల్దార్ రవీందర్, డీఈ నర్సింహులు, సభ్యులు పాల్గొన్నారు.