అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

ABN , First Publish Date - 2023-06-11T00:18:13+05:30 IST

మండల కేంద్రంలో ఆతి పురాతనమైన శ్రీ సీతారాముల ఆలయాన్ని మంత్రి హరీశ్‌రావు, గ్రామస్థులు, దాతల సహకారంతో పునర్నిర్మాణం పూర్తి చేసుకుని విగ్రహల ప్రతిష్ఠకు, ధ్వజస్తంభం నిర్మాణానికి ముస్తాబైంది.

అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు
హోమం నిర్వహిస్తున్న హనుమాన్‌ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్‌ స్వామి

నారాయణరావుపేటలో ఐదు రోజుల ఉత్సవాలు

నారాయణరావుపేట, జూన్‌ 10: మండల కేంద్రంలో ఆతి పురాతనమైన శ్రీ సీతారాముల ఆలయాన్ని మంత్రి హరీశ్‌రావు, గ్రామస్థులు, దాతల సహకారంతో పునర్నిర్మాణం పూర్తి చేసుకుని విగ్రహల ప్రతిష్ఠకు, ధ్వజస్తంభం నిర్మాణానికి ముస్తాబైంది. ఆలయ ఉత్సవాలు ఈ నెల 10న ప్రారంభం కాగా 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని సుమారు రూ. 60 లక్షల వ్యయంతో పునరుద్ధరిస్తున్నారు. ఆలయంలో శ్రీ రాముడు దక్షిణ హస్తంలో బాణాన్ని ధరించి సీతమ్మ వారు పద్మాసనంలో స్వామివారి పైన కూర్చుండి ఎడమ వైపు శతృజ్ఞుడు, కుడి వైపు లక్ష్మణుడు, భరతుడు, ఎదురుగా దక్షిణ ముఖంగా హనుమంతుడు ఉండటం ఆలయంలో విశేషం. అన్ని హంగులతో విగ్రహల ప్రతిష్ఠాపనకు ఆలయాన్ని సిద్ధం చేశారు. త్రిదండి చిన్న జీయర్‌స్వామి మంగళశాసనాలతో హనుమాన్‌ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్‌స్వామి పర్యవేక్షణలో విగ్రహల ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు పొడిచేటి శ్రీనివాసాచార్యులు తెలిపారు. కాగా ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన శనివారం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, ఉత్సవ మూర్తుల శోభాయాత్ర, వాసుదేవా ఫూణ్యాహవాచనం, ఆఖండ దీపారాధనతో కార్యక్రమం ప్రారంభించారు. హనుమాన్‌ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్‌ స్వామి పర్యవేక్షణలో పంచ గవ్య, హోమం తీర్థప్రసాదాల వితరణ నిర్వహించారు. బుధవారం యాగశాలలో ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, మహా పూర్ణాహుతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-06-11T00:18:13+05:30 IST