నా తుది శ్వాస వరకు సేవ చేస్తా
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:36 PM
యోగా, ధ్యానంతోనే ఆనందం, ఆరోగ్యం
పెద్దాసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేట టౌన్, డిసెంబరు 23 : నా తుది శ్వాస వరకు సిద్దిపేట ప్రజలకు సేవ చేస్తానని, నాకు సంపూర్ణ ఆశీస్సులు అందించిన ప్రజలకు ధన్యావాదాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రబలకుండా చూడాలని దేవున్ని ప్రార్థించానన్నారు. స్థానిక గణే్షనగర్ శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు ద్వారాన్ని హరీశ్రావు ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి పనులు, షెడ్ నిర్మాణ పనులఫై సంతృప్తి వ్యక్తం చేశారు. మిగులు పనులు పూర్తి చేసి కొద్దీ రోజుల్లోనే ప్రారంభం చేసుకుందామని మంత్రి చెప్పారు. సిద్దిపేటలోని వైశ్య సదనంలో విశ్వ హృదయ సమ్మేళనం కార్యక్రమంలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజమైన ఆనందం, ఆరోగ్యం యోగా, ధ్యానం చేసినప్పుడే ఉంటుందన్నారు. రిషీ ప్రభాకర్ గురూజీ యోగ, ధ్యానం ఎంతో మార్గదర్శమని తెలిపారు. తాను ప్రతీరోజు యోగా చేస్తానని, అందుకే ఇంత ఆరోగ్యంగా, ఓపికతో ఉంటానన్నారు.
అన్ని మతాలను ఆదరించాం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము అన్ని మతాలకు సముచిత గౌరవమిచ్చి ఆదరించామని ఎమ్మెల్యే హరీశ్రావు గుర్తుచేశారు. శనివారం సిద్దిపేటలోని గాడ్ విజన్ అసోసియేషన్, పాస్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నామినేషన్ వేసే సమయంలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సిద్దిపేట చర్చిలో ప్రార్థనలు చేశానని గుర్తు చేశారు. సిద్దిపేట అంటేనే సర్వ మతాలను గౌరవించే సంస్కృతి మనదన్నారు. ఉడుత భక్తిగా తన నెల వేతనాన్ని అసోసియేషన్కు సహాయం అందిస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, 59 జీవో పత్రాలను హరీశ్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 11వేల మందికి కల్యాణలక్ష్మి ద్వారా రూ.93 కోట్ల చేయూతనిచ్చామని చెప్పారు. సిద్దిపేటలో కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, పెద్దాస్పత్రిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, తదితర నాయకులు పాల్గొన్నారు.