ఘనంగా సిద్ధయ్య స్వామి గురు పట్టాభిషేకం
ABN , First Publish Date - 2023-02-05T23:34:08+05:30 IST
మండలంలోని బర్దీపూర్ దత్తగిరి మహరాజ్ ఆశ్రమంలో ఆదివారం భావి పీఠాధిపతి డాక్టర్ సిద్ధయ్య స్వామి గురు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఝరాసంగం, ఫిబ్రవరి 5: మండలంలోని బర్దీపూర్ దత్తగిరి మహరాజ్ ఆశ్రమంలో ఆదివారం భావి పీఠాధిపతి డాక్టర్ సిద్ధయ్య స్వామి గురు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కర్ణాటక, మహరాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మొదట కాశీజగద్గురుకు ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహరాజ్ గ్రామం ప్రధాన రహదారి గుండా ఆశ్రమం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆశ్రమ పీఠాధిపతి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం ఆశ్రమంలో అతిరుద్రమం, రుద్రసహిత దత్తయజ్ఞం, నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీ జగద్గురు, ఆశ్రమ పీఠాధిపతి అవదూత గిరి మహరాజ్... మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలన్నారు. భగవంతుని నామస్మరణం చేయడం ముక్తి కలుగుతుందన్నారు. ఆశ్రమ ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ సునీతా హనుమంతురావుపాటిల్, సర్పంచ్ శివలక్ష్మీకృష్ణ, ఆయా ఆశ్రమాల పీఠాధిపతులు, ఆశ్రమ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేషంగుప్తా, భక్తులు పాల్గొన్నారు.