లక్కు చిక్కింది.. షాపు దక్కింది

ABN , First Publish Date - 2023-08-22T01:20:53+05:30 IST

మద్యం దుకాణాల కేటాయింపు కోసం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో సోమవారం ఏర్పాటు చేసిన లాటరీ ప్రక్రియ ఉత్కంఠంగా కొనసాగింది.

లక్కు చిక్కింది.. షాపు దక్కింది

ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ

లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు

కేంద్రాల వద్ద సందడి

సిద్దిపేట క్రైం, ఆగస్టు 21 : మద్యం దుకాణాల కేటాయింపు కోసం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో సోమవారం ఏర్పాటు చేసిన లాటరీ ప్రక్రియ ఉత్కంఠంగా కొనసాగింది. జిల్లాలో ఉన్న 93 మద్యం దుకాణాల కోసం 4,116 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ జీవన్‌పాటిల్‌ లక్కీడ్రాను ప్రారంభించారు. మొదట ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సమూర్తి ఎంపిక ప్రక్రియ విధివిధానాలను దరఖాస్తుదారులకు వివరించారు. అనంతరం జిల్లా పరిధిలోని 93 దుకాణాలను లాటరీ ద్వారా దరఖాస్దుదారులకు కేటాయించారు. మొదటగా ఐదు దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నవారిని మాత్రమే లోనికి అనుమతించారు. ఆ దుకాణాల డ్రా పూర్తయిన తర్వాత మరో ఐదు దుకాణలకు దరఖాస్తు చేసుకున్న వారిని అనుమతించారు.

కొండపోచమ్మ వైన్స్‌ డ్రాలో గందరగోళం

జిల్లాలో ఉన్నటువంటి 93 మద్యం దుకాణాల్లో అత్యధికంగా జగదేవపూర్‌ మండలం తీగుల్‌ నర్సాపూర్‌ (కొండపోచమ్మ) వైన్స్‌కు 177 దరఖాస్తులు వచ్చాయి.మేడ్చల్‌ జిల్లాకు చెందిన మదన్‌మోహన్‌గౌడ్‌ (టోకెన్‌ నంబరు 99) ఈ దుకాణాన్ని దక్కించుకున్నాడు. అయితే సిండికేట్‌గా ఏర్పడి కొన్ని టెండర్లు వేసిన కొందరు అది 99 కాదు 66 అంటూ గొడవకు దిగారు. పోలీసులు, అధికారులు వారిని సముదాయించి, మరోసారి పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.

Updated Date - 2023-08-22T01:20:53+05:30 IST