లారీల కొరత తీర్చాలని రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2023-05-25T23:10:15+05:30 IST

ధాన్యాన్ని కొనుగోలు చేసినా లారీల కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం మిరుదొడ్డిలో రైతులు రోడ్డుపైన బైఠాయించి రాస్తారోకో చేశారు.

లారీల కొరత తీర్చాలని రైతుల రాస్తారోకో
మిరుదొడ్డిలో రాస్తారోకో చేస్తున్న రైతులు

మిరుదొడ్డి, మే 25: ధాన్యాన్ని కొనుగోలు చేసినా లారీల కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం మిరుదొడ్డిలో రైతులు రోడ్డుపైన బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిరుదొడ్డిలోని మార్కెట్‌ కమిటీలో ధాన్యాన్ని తూకం వేసినా తరలించడానికి లారీలు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోయారు. అకాల వర్షాల వల్ల తూకం వేసిన ధాన్యం తడిస్తే రైస్‌మిల్లర్లు తీసుకోకుండా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతులు రాస్తారోకో చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్దిచెప్పారు. అయినా కూడా రైతులు వినలేదు. తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో తరలించే వరకు రాస్తారోకోను విరమించేలేది లేదని తెల్చిచెప్పారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో తరలిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.

Updated Date - 2023-05-25T23:10:15+05:30 IST