అదిరిపోయేలా దశాబ్ది ఉత్సవాలు
ABN , First Publish Date - 2023-06-01T00:23:15+05:30 IST
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సిద్దిపేట నియోజకవర్గంలో అదిరిపోయేలా నిర్వహిద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి
పంటకాలాన్ని ఒక నెల ముందుకు జరపాలి
అబద్దాలాడుతున్న ప్రతిపక్షాలను అభివృద్ధితో తిప్పికొట్టాలి
బీఆర్ఎస్ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకు వివరించాలి
దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి హరీశ్రావు
సిద్దిపేటటౌన్, మే31: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సిద్దిపేట నియోజకవర్గంలో అదిరిపోయేలా నిర్వహిద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో దశాబ్ది ఉత్సవాల నిర్వాహణపై కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్, అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్, నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు, అన్నిశాఖలకు చెందిన జిల్లా అధికారులతో కలిసి మంత్రి హరీశ్రావు, నియోజకవర్గస్థాయి అవగాహన, సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. దశాబ్ద కాలంలో శతాబ్ధి అభివృద్ధి సాధించామని స్పష్టం చేశారు. నాడు ఉద్యమంలో..నేడు అభివృద్ధిలో ముందున్నట్లు ఆయన తెలిపారు. సిద్దిపేటలో జరిగే వేడుకలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి చూసేలా, అభివృద్ధిలో సిద్దిపేట అధ్యయన కేంద్రంగా మార్చుకున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని చాటేలా వేడుకలను నియోజకవర్గంలోని ప్రతి పల్లె, పట్టణాల్లో పండుగ వాతావరణంలో జరపాలని సూచించారు. ఆధ్యాత్మికం, పర్యాటకం ఇలా ఏ రంగంలోనైనా సీఎం కేసీఆర్ నాయకత్వంలో గుణాత్మక మార్పు సాధించామన్నారు. 21 రోజుల ఈ దశాబ్ది ఉత్సవాల పండుగలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, నాడు-నేడు సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రభుత్వం పదేళ్లలో సాధించిన ప్రగతి తెలిస్తేనే, అనుకున్న కార్యక్రమం సఫలీకృతం అవుతుందని వివరించారు. దశాబ్ది ఉత్సవ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ హాజరు కావాలని, నిర్లక్ష్యం ఉండొద్దంటూ స్థానిక గ్రామప్రజాప్రతినిధులు గుర్తించి సహకారాన్ని అందించాలని చెప్పారు. మండల స్థాయి అధికారుల సమన్వయంతో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యమైతే ఈ కార్యక్రమం ప్రతీ గ్రామంలో విజయవంతం అవుతుందని సూచించారు. గత పాలనలోతాగునీరు, సాగునీటికోసం కష్టాలు ఉండేవని, మహారాష్ట్రలో ఇప్పటికీ తాగునీరు సరఫరా ఇబ్బందులు ఉన్నట్లు చెప్పారు. పక్క రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాలన్నారు. తల్లి, శిశు మరణాలు తగ్గి దేశానికే ఆదర్శంగా నిలిచామని, 14వ స్థానం నుంచి 3వ స్థానంలో తెలంగాణ వైద్యం చేరుకున్నట్లు చెప్పారు. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్లో తెలంగాణ వంద శాతంగా ముందున్నామని, డబుల్ ఇంజన్ సర్కారు ఉత్తరప్రదేశ్, గుజరాత్లు చిట్ట చివరి స్థానంలో ఉన్నట్లు హరీశ్రావు తెలిపారు. వీటిపై చర్చ, మార్పులపై ప్రజలకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. నిజం ప్రచారం చేయకపోతే అబద్ధాలు రాజ్యమేలుతాయని, దీంతో ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారన్నారు. నారుపోసుడు నాలుగైదు రోజుల్లో మొదలు పెట్టాలని, వెదజల్లె పద్ధతిలో సాగుచేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు. గత పాలనలో వ్యవసాయానికి కాదు, తాగడానికి నీరుండేది కాదన్నారు. పంట కాలాన్ని ఒక నెల ముందుకు తీసుకువచ్చేలా, రైతుల్లో ఒక మార్పుకు కృషిచేద్దామని సూచించారు. జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని, ఇంకా లక్ష టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని కట్టె పట్టుకుని చూపించాడని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యుత్ కష్టాలు లేవని తెలిపారు. ఇక సాగునీటి దినోత్సవం సాయంత్రం రంగనాయకసాగర్ వద్ద ఘనంగా సంబురాలు చేద్దామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు ఉన్నాయన్నారు. పేదలకు సొంతజాగలో ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే సాయం పథకం గృహలక్ష్మీ ప్రారంభించుకుందామని హరీశ్రావు చెప్పారు. 70 ఏళ్లలో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 1450 పడకలున్నాయని, త్వరలోనే 2వేల పడకలను పెంచేలా కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. మున్సిపాలిటీ పట్టణ ప్రగతి గురించి నాడు-నేడు అనే కోణంలో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావు సూచించారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే 40 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, ఈ క్రమంలో ప్రతి ఊరిలో వెయ్యి మొక్కలు నాటాలని కోరారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని విద్యప్రగతిలో వచ్చిన కొత్త మార్పు గురించి ప్రజలకు విద్య దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. ఇక ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా అన్నీ ఆలయాలు, మసీదులు, చర్చిల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని దీవించేలా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయాలన్నారు. జూన్ 22న చివరి రోజున సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సాఽధారణ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ అమరుల వీరుల పోరాటంపై రెండు నిమిషాలు మౌనం పాటిద్దామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులరాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, సుడి డైరెక్టర్ మచ్చవేణుగోపాల్రెడ్డి, నాయకులు రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్లు కలకుంట్ల మల్లికార్జున్, గ్యాదరి రవీందర్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
ఆటోకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
గజ్వేల్: ఆటోకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద దశాబ్ది ఉత్సవాల సందర్బంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముద్రించిన బీఆర్టీయూ ఆటోయూనియన్ ఆటో పోస్టర్ను ఆయన ఎఫ్ఢీసీ చైర్మన్ ప్రతా్పరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 4వేల మంది ఆటో కార్మికులకు దుస్తులు(ఖాకీ షర్టులు) అందజేస్తామన్నారు. దళితబంధు పథకం అందని ఆటోడ్రైవర్లకు గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందిస్తామన్నారు. లైసెన్సులు లేని డ్రైవర్లందరికీ ఉచితంగా లైసెన్సులు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కార్మికులంతా బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, ప్రధాన కార్యదర్శి సాగర్ల బాల్రాజుయాదవ్, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతని ఆసా, ఎండీ కరీం, ఎండీ సూరజ్, సాయిబాబ, పంజాల నరసింహగౌడ్, రాజుచారి, ఎండీ సలీం, ఎర్రోళ్ల శ్రీనివాస్, హమీద్, శ్రీనివా్సచారి, జీవన్, రాజీ శ్రీనివాస్, స్వామి, ఎండీ షాదూల్, కుకునూరుపల్లి మండల బీఆర్టీయూ అధ్యక్షుడు పేర్ల రమేశ్ పాల్గొన్నారు.