ఆలయ భూముల్లో నిర్మాణాల కూల్చివేత
ABN , First Publish Date - 2023-03-25T23:52:18+05:30 IST
దేవాదాయ భూముల్లో నిర్మించిన ఇళ్లను ఎండోమెంట్, రెవెన్యూశాఖల అధికారులు కూల్చివేశారు.
పటాన్చెరు రూరల్, మార్చి 25: దేవాదాయ భూముల్లో నిర్మించిన ఇళ్లను ఎండోమెంట్, రెవెన్యూశాఖల అధికారులు కూల్చివేశారు. పటాన్చెరు మండలం చిట్కుల్లోని 266, 267, 305, 306 సర్వే నంబర్లలోని ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఐదు ఇళ్లను తహసీల్దార్ పరమేశం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు శనివారం కూల్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ భూముల్లో నిర్మించిన కట్టడాలను తొలగించి ఆయా సర్వే నంబర్లలో ఉన్న 8 ఎకరాల ఆలయ భూమికి రక్షణ కల్పిస్తామని తెలిపారు. మరోవైపు ఆకస్మిక కూల్చివేతలపై స్థానికులు మండిపడ్డారు. నోటీసులు కూడా ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేయడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు ఇళ్లను నిర్మించే సమయంలో మౌనం వహించిన అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా కూల్చివేతలకు పాల్పడడమేమిటని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.