రైతులకు దక్కని పంట నష్టం పరిహారం

ABN , First Publish Date - 2023-06-17T00:08:43+05:30 IST

ఆరుగాలం కష్టపడి యాసంగి పంటలు సాగు చేసిన రైతులను అకాల వర్షాలు నిండా ముంచాయి. పెట్టుబడి కూడా తిరిగిరాక సాగు కోసం చేసిన అప్పులు మాత్రం మిగిలాయి.

రైతులకు దక్కని  పంట నష్టం పరిహారం

మొదటి విడత నష్టపోయిన రైతులకు రూ.8.86 లక్షలు జమ

రెండు, మూడు విడతల్లో వర్షాలకు నష్టపోయిన రైతుల ఎదురుచూపులు

కేంద్రాలు మూసేసినా వడ్ల పైసలు ఇంకా జమ కాలేదని ఆవేద

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూన్‌ 16 : ఆరుగాలం కష్టపడి యాసంగి పంటలు సాగు చేసిన రైతులను అకాల వర్షాలు నిండా ముంచాయి. పెట్టుబడి కూడా తిరిగిరాక సాగు కోసం చేసిన అప్పులు మాత్రం మిగిలాయి. వానకాలం పంటల సాగు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మూడుసార్లు భారీ వర్షాలు కురిసి పంటలకు నష్టం వాటిల్లగా.. ప్రభుత్వం మాత్రం మొదట నష్టపోయిన రైతాంగానికి మాత్రమే పరిహారం అందజేసి చేతులు దులుపుకుంది. అత్యధిక నష్టం జరిగిన రెండు, మూడో విడత పంట నష్టం పరిహారం రైతులకు ఇప్పటికీ అందలేదు. దీంతో వానకాలం పెట్టుబడి కోసం వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నదని అన్నదాతలు వాపోతున్నారు.

మెదక్‌ జిల్లాలో అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. మార్చిలో కురిసిన 5 మండలాల పరిధిలోని 8 గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. నిబంధనల ప్రకారం వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. 98 మంది రైతులకు సంబంధించిన 88.25 ఎకరాల్లో పంటలు నష్టపోగా.. ఎకరాకు రూ. 10 వేల చొప్పున రూ.8,86,250 నష్టపరిహారాన్ని జూన్‌ 2న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కానీ ఆ తరువాత రెండుసార్లు భారీ వర్షాలు కురియగా పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. వారికి ప్రభుత్వం పరిహారం ఇవ్వనేలేదు. మొదటి విడత నష్టపరిహారం రావడానికి 3 నెలలు పట్టింది. ఇక రెండు, మూడు విడతల్లో పంట నష్టపోయినవారికి పరిహారం అందించడానికి ఇంకెంత సమయం పడుతుందోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

33 వేల మంది ఎదురుచూపులు

అకాల వర్షాల జిల్లాలో మూడుసార్లు పంట నష్టం తీవ్రంగా జరిగింది. మొదటి విడతలో మార్చిలో కురిసిన వర్షానికి 98 మంది రైతులకు సంబంధించిన 88.25 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అయితే ఏప్రిల్‌ 22 నుంచి 27 మధ్యన రెండో విడత కురిసిన అకాల వర్షాలకు 14,329 ఎకరాల్లో 12,177 మంది రైతులకు సంబంధించిన వరి, మొక్కజొన్న, తెల్లజొన్న పంటలు నీట మునిగాయి. రైతులకు కోట్లాది రూపాయల నష్టం జరిగింది. మూడవ విడత ఏప్రిల్‌ 28 నుంచి మే 5 వరకు భారీ వర్షాలు కురిశాయి. ఈ సమయంలో 18,812 మంది రైతులకు సంబంధించిన 20,618 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం జరిగింది. మూడు విడతలుగా జరిగిన పంట నష్టం వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరించారు. నష్ట పరిహారాని సంబంధించి వేర్వేరుగా నివేదికలను రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. కానీ రెండు, మూడు విడతల్లో నష్టపోయిన పంటలకు పరిహారం ఇంకా విడుదల కాలేదు. 33,141 మంది రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం సాగు కోసం పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతున్నారు. కనీసం ధాన్యం డబ్బులైనా వస్తాయనుకుంటే అవి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వడ్లు అమ్మిన పైసలైనా ఇప్పించండి

-గెల్లు శ్రీశైలం, నందిగామ

పంట నష్టం వివరాలను అధికారులు నమోదు చేసుకుని నెల దాటినా ఇప్పటివరకు పైసా పరిహారం రాలేదు. నాలుగెకరాల్లో వరి పండిస్తే అకాల వర్షాలకు రెండెకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరాకు రూ. 10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు పైసలు రాలేదు. మిగిలిన వడ్లను 20 రోజుల కింద కేంద్రంలో అమ్మితే ఆ పైసలు కూడా రాలేదు. వానాకాలం పంట సాగు కోసం చేతిలో చిల్లిగవ్వ లేదు.

Updated Date - 2023-06-17T00:08:43+05:30 IST