Share News

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్‌రెడ్డి రాజీనామా

ABN , First Publish Date - 2023-11-06T23:50:03+05:30 IST

మెదక్‌ జిల్లాలో బీజేపీ కీలక నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్‌రెడ్డి రాజీనామా

మెదక్‌ అర్బన్‌, నవంబరు 6: మెదక్‌ జిల్లాలో బీజేపీ కీలక నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. మెదక్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తన అనుచరులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. 11 ఏళ్ల సర్వీసు ఉన్నా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని వదిలి బీజేపీ కోసం రాజకీయాల్లోకి వచ్చానని, మూడేళ్లుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడినా తగిన గుర్తింపు లభించలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు సొంత డబ్బు రూ. కోటి ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో సిద్దాంతాలు లేవని, డబ్బులు తీసుకుని పైరవీకారులకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. పనిచేసే నేతల గొంతు నొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడునెలల క్రితం పార్టీలో చేరిన విజయ్‌కుమార్‌కు ఏ ప్రాతిపాదికన మెదక్‌ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్‌ ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ తనను మోసం చేశారని, ఆయన స్వార్థ రాజకీయాలతో పార్టీ తీవ్రంగా నష్ట పోయిందని ఆరోపించారు. గడ్డం శ్రీనివాస్‌ డబ్బులకు అమ్ముడుపోయారని విమర్శించారు. ఇకపై బీజేపీ ఓ తనకు ఎలాంటి సంబంధం లేదని, మళ్లీ పార్టీలోకి వచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానిని జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆయన వెంట బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సందీప్‌ రమాకాంత్‌, రాజేష్‌రెడ్డి, నవీన్‌గౌడ్‌, రాజశేఖర్‌, రమేష్‌, చందు, తేజ, సంజీత్‌, భూమాగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-11-06T23:50:29+05:30 IST