బాదుడే బాదుడు!
ABN , First Publish Date - 2023-06-12T00:24:56+05:30 IST
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్ 11: ‘సిద్దిపేట పట్టణంలో ఇటీవల ఏర్పాటైన ఓ ప్రైవేట్ పాఠశాలలో నర్సరీకి రూ.60 వేల ఫీజు నిర్ణయించారు. పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ, వ్యాన్ ఖర్చులు అదనం. ఇక ఇదే సిద్దిపేటలో పలు బ్రాంచీలతో నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలకు డిమాండ్ పెరగడంతో అదేస్థాయిలో ఫీజులను భారీగా పెంచారు.
ప్రైవేట్ స్కూళ్లలో భారీగా ఫీజుల పెంపు
20 నుంచి 30 శాతం పెంచిన యాజమాన్యాలు
యూనిఫామ్, పుస్తకాలు, స్టేషనరీ పేరిట మరింత వసూళ్లు
ఐపీఎల్, టెక్నో, ప్రైమ్, కార్పొరేట్ పేరిట దోపిడీ
నిబంధనలు గాలికి.. అధికారులు గప్చుప్
సామాన్యులకు తప్పని ఆర్థికభారం
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూన్ 11: ‘సిద్దిపేట పట్టణంలో ఇటీవల ఏర్పాటైన ఓ ప్రైవేట్ పాఠశాలలో నర్సరీకి రూ.60 వేల ఫీజు నిర్ణయించారు. పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ, వ్యాన్ ఖర్చులు అదనం. ఇక ఇదే సిద్దిపేటలో పలు బ్రాంచీలతో నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలకు డిమాండ్ పెరగడంతో అదేస్థాయిలో ఫీజులను భారీగా పెంచారు. ఐపీఎల్, టెక్నో, ఐఐటీ, ప్రైమ్ అంటూ తోకలు తగిలించి అందినకాడికి దండుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 228 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం కావడంతో అడ్మిషన్ల కోసం నెలరోజుల ముందు నుంచే కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ గురుకులాలు, మోడల్ స్కూళ్లకు సంబంధించిన అర్హత పరీక్షలు, ఫలితాలు పూర్తికావడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఒక మెట్టు పైకెక్కాయి. ఫీజుల విషయంలో తగ్గేదే లేదంటూ జులుం ప్రదర్శిస్తున్నాయి.
బాదుడే.. బాదుడు
పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చుచేస్తారనే ఒకే ఒక్క బలహీనతను పలువురు ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆసరాగా తీసుకున్నారు. అందుకే ప్రతిఏటా ఫీజులను భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం 20 నుంచి 40 శాతం దాకా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా యాజమాన్యాల నియంత్రణలోనే యూనిఫామ్లు, పుస్తకాలు విక్రయిస్తున్నారు. వారికి అనుబంధంగా బుక్ డిపోలు సమకూర్చుకొని అమ్ముతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా డీజిల్ ధర పెరిగిందనే సాకుతో వ్యాన్ ఫీజులు కూడా పెంచారు. గత ఏడాది ప్రతీనెల లోకల్ వ్యాన్ ఫీజు రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేసేవారు. ఇప్పుడు 20 శాతం పెంచినట్లు చెబుతున్నారు. సాధారణ ప్రైవేట్ పాఠశాలల కంటే కార్పొరేట్ పేరిట నిర్వహిస్తున్న పాఠశాలలే ఈ దోపిడీలో ముందున్నాయి. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడలేక, చాలీచాలని ఫీజులతో స్కూళ్లను నడపలేక పలువురు ప్రైవేట్ పాఠశాలల యజమానులు చేతులెత్తేస్తున్న పరిస్థితులు కూడా జిల్లాలో ఉన్నాయి.
విద్యాశాఖ పర్యవేక్షణ కరువు
ప్రభుత్వ పాఠశాలలపైనే విద్యాశాఖ పూర్తిగా దృష్టిపెడుతోంది. కానీ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫీజుల నియంత్రణ కమిటీ, పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయడం లేదు. పరిమితికి మించి విద్యార్థులను చేర్చుకుంటున్నా పట్టింపు లేదు. ఇక పాఠశాల రిజిస్ర్టేషన్తో సంబంధం లేకుండా విద్యార్థులను ఆకర్షించడానికి రకరకాల తోకలు తగిలిస్తున్నారు. ఐఐటీ, ఐపీఎల్, టెక్నో, డీజీ, స్పేస్, ఇంటర్నేషనల్, ప్రైమ్ అంటూ బురిడీ కొట్టించి ఫీజులు పెంచుతున్నారు. దీనిపై కూడా విద్యాశాఖ దృష్టి పెట్టడం లేదు. రెన్యూవల్, ఉపాధ్యాయుల అర్హతలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కఠిన చర్యలు తీసుకుంటాం
గుర్తింపు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. ప్రైవేట్ పాఠశాలలన్నీ నిబంధనలు పాటించాలి. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయించకూడదు. తమకు ఫిర్యాదులు వస్తే చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యేక దృష్టిపెడతాం. ప్రతీ ప్రైవేట్ పాఠశాలపై మా పర్యవేక్షణ ఉంటుంది.
శ్రీనివా్సరెడ్డి, డీఈవో, సిద్దిపేట
సర్కారు స్కూళ్లలోనే మెరుగైన విద్య
పేద, మధ్యతరగతి వర్గాలకు అధిక ఫీజుల నుంచి ఉపశమనం కలిగించడానికే ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారు. మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ నూటికి నూరుశాతం ఫలితాలు సాధిస్తున్నాయి. ఎలాంటి ఫీజు లేకుండా చదువు చెబుతూ ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్తోపాటు కార్పొరేట్ స్థాయిలో అన్నిరకాల సాంకేతిక విద్యలను అందిస్తున్నారు.
మహిపాల్గౌడ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు, సిద్దిపేట