వారానికి ఒక్కరోజు హాజరుకారా.?
ABN , First Publish Date - 2023-08-22T00:59:10+05:30 IST
సంగారెడ్డి రూరల్, ఆగస్టు 21: వారానికి ఒకరోజు నిర్వహించే ప్రజావాణికి అధికారులు హాజరుకారా అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులపై అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం
సంగారెడ్డి రూరల్, ఆగస్టు 21: వారానికి ఒకరోజు నిర్వహించే ప్రజావాణికి అధికారులు హాజరుకారా అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు ఆర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా, వైద్యం, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, డీఆర్డీఏ వివిధ శాఖల అధికారులు ప్రతి సోమవారం ప్రజావాణికి విధిగా హాజరుకావాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీల్లో కొన్ని ముఖ్యమైనవి ఈ విధంగా ఉన్నాయి.. మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గ్రామంలోని సర్వే నెంబర్ 104 లేదా 107లోని ప్రభుత్వ భూమి 13.10 ఎకరాలు ఉన్నదని, అందులో తనకు ఐదు ఎకరాలు లీజుకు ఇస్తే సాగు చేసుకుంటూ బతుకుతానని ఆర్జీలో కోరారు. తనకు 4.18 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని దానికి సంబంధించిన రైతుబంధు డబ్బులు ఇప్పించాలని సదాశివపేట మండలానికి చెందిన రైతులు ఆర్జీలో కోరారు. సంగారెడ్డి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన బోయిన రమేష్ వీఆర్ఏగా పనిచేస్తూ గతేడాది గుండెపోటులో మృతిచెందాడని, అతని ఉద్యోగం ఆయన కుటుంబసభ్యులమైన తమకు ఇప్పించాలని బోయిన యాదమ్మ ఆర్జీలో వేడుకున్నారు. మనూర్ మండలం హుక్రానా గ్రామంలో దళితబంధు అర్హులమైన తమకు ఇవ్వకుండా డబ్బున్నవాళ్లకే ఇచ్చారని గ్రామానికి చెందిన సుందరయ్య, దత్తు, గోపాల్, అశోక్, అబ్రహంలు మరో 30 మంది సంతకాలతో కూడిన ఫిర్యాదును అందజేశారు. వచ్చిన ఆర్జీలను పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో నగే్షగౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
సిద్దిపేట అగ్రికల్చర్, ఆగస్టు 21: ప్రజావాణికి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని డీఆర్వో నాగరాజమ్మ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజా వినతులను ఏవో అబ్దుల్రహీంతో కలిసి ఆమె స్వీకరించి మాట్లాడారు. ఎంతో నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వివిధ సమస్యలతో వస్తారని, సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను తీసుకోవడమే కాకుండా శుక్రవారం లోగా దరఖాసుదారుల సమస్యల పురోగతి రిపోర్టును అందించాలని ఆమె తెలిపారు. భూ సంబంధిత, ఆసరా, పింఛన్లు ఇతర సమస్యలను కలిపి మొత్తం 44 ఆర్జీలు వచ్చాయని ఆమె తెలిపారు.