నవోదయలో ‘తొమ్మిది’ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2023-02-10T23:26:20+05:30 IST
వర్గల్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు పరీక్షాకేంద్రాలు
హాజరు కానున్న 970 మంది విద్యార్థులు
వర్గల్, ఫిబ్రవరి 10: వర్గల్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం జరుగనున్న ప్రవేశ పరీక్ష కోసం నవోదయ విద్యాలయంతో పాటు ప్రజ్ఞాపూర్ సెయింట్ మెరి విద్యానికేతన్ హై స్కూల్, గజ్వేల్ సెయింట్ జోసఫ్ గర్ల్స్ హైస్కూల్ సిద్ధమైనట్లు నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ రమేశ్రావు వెల్లడించారు. తొమ్మిదో తరగతిలో ఖాళీ అయిన 6 సీట్ల భర్తీకి గాను ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 970 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అందులో 408 మంది విద్యార్థులు ప్రజ్ఞాపూర్ సెయింట్ మెరి విద్యానికేతన్ హై స్కూల్లో, 240 మంది విద్యార్థులు గజ్వేల్ సెయింట్ జోసఫ్ గర్ల్స్ హై స్కూల్లో, 322 మంది విద్యార్థులు వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్ష రాయనున్నట్టు తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు పరీక్షాకేంద్రానికి అరగంట ముందే అడ్మిట్ కార్డుతో చేరుకోవాలని సూచించారు.