మద్యం దుకాణాల కేటాయింపు
ABN , First Publish Date - 2023-08-22T01:13:58+05:30 IST
కొత్త మద్యం పాలసీ 2023-25కి సంబంధించి దుకాణాల కేటాయింపు ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది.
సంగారెడ్డి టౌన్/మెదక్ అర్బన్, ఆగస్టు 21: కొత్త మద్యం పాలసీ 2023-25కి సంబంధించి దుకాణాల కేటాయింపు ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటల్లో నిర్వహించిన లక్కీడ్రాలో అదృష్టవంతులు షాపులను దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 101 మద్యం దుకాణాలకు 6,156 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. సంగారెడ్డిలోని జేఆర్ఆర్ ఫంక్షన్హాల్లో జిల్లా కలెక్టర్ ఎ.శరత్ స్వయంగా లాటరీ తీసి దుకాణాలను కేటాయించారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన లాటరీ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. వేలాది మంది తరలిరావడంతో 65వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్, సూపరింటెండెంట్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
మెదక్లో..
మెదక్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వరగార్డెన్లో లక్కీడ్రా నిర్వహించారు. జిల్లాలోని 49 మద్యం షాపులకు 1,905 టెండర్లు దాఖలవగా లక్కీడ్రాలో అదృష్టం వరించినవారు సంబరాల్లో మునిగిపోయారు. దుకాణాలు దక్కని వారు నిరాశతో వెనుదిరిగారు. లక్కీడ్రాలో 41 మంది పురుషులు, 8 మంది మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు. మెదక్ సర్కిల్ పరిధిలోని పోతంశెట్టిపల్లిలో ఉన్న షాపు నం. 15కు అత్యధికంగా 111 దరఖాస్తులు రాగా.. ఉదయ్కిరణ్ను అదృష్టం వరించింది. మద్యం దుకాణాల లక్కీడ్రా సందర్భంగా పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. టెండర్దారులు, కుటుంబ సభ్యులు, మిత్రులు తరలిరావడంతో జాతరను తలపించింది. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పాసులున్నవారిని మాత్రమే లోనికి అనుమతించారు.