13న ప్రత్యేక జాబ్మేళా
ABN , First Publish Date - 2023-06-03T00:09:31+05:30 IST
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా సిద్దిపేట ఐటీ టవర్ తెచ్చినట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు.
స్థానిక యువతకు ఉద్యోగాల కోసమే ఐటీ టవర్
ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్ష
సిద్దిపేటటౌన్, జూన్2: ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా సిద్దిపేట ఐటీ టవర్ తెచ్చినట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్, సీపీ శ్వేత, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్, పలు దేశాల ప్రముఖ ఐటీ కంపెనీ ప్రతినిధులతో కలిసి సిద్దిపేట ఐటీ టవర్ ప్రారంభం, ప్రత్యేక జాబ్ మేళా ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈసందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో 718 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఐటీ టవర్లో ప్రముఖ ఐటీ కంపెనీలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట ఐటీ టవర్లో భాగస్వామ్యమయ్యే కంపెనీలకు రెండేళ్ల పాటు ఉచితంగా నిర్వహణ, అద్దె, విద్యుత్, ఇంటర్నెట్ బిల్లు ఖర్చులు భారం లేకుండా చూస్తామని చెప్పారు. తమతో కలిసి వచ్చే కంపెనీలకు ఎలాంటి రాయితీలు కావాలన్నా ఇచ్చేందుకు ప్రభుత్వపరంగా కలెక్టర్, అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఐటీ టవర్లో స్థానిక యువతకు ప్రాధాన్యం ఉండేలా ఈనెల 13న సిద్దిపేటలో ప్రత్యేక జాబ్మేళా నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఓఎ్సఐ డిజిటల్, జోలాన్ టెక్, విసన్ ఇన్ఫోటెక్, అమిడాయ్ ఎడ్యుటెక్, ఫిక్సిటీ టెక్నాలజీస్, ఇన్నోసోల్, థోరాన్ టెక్నాలజీస్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్, ర్యాంక్ ఐటీ సర్వీసెస్, తదితర కంపెనీలు 300 మందికి పైగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీల ప్రతినిధులు వివరించారు.