మృత్యువులోనూ వీడని రక్తసంబంధం
ABN , First Publish Date - 2023-12-02T23:27:56+05:30 IST
లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు అన్నదమ్ముళ్ల ప్రాణం తీసింది.
రోడ్డు ప్రమాదంలో అన్నాతమ్ముళ్ల మృతి
పాపన్నపేట, డిసెంబరు 2: లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు అన్నదమ్ముళ్ల ప్రాణం తీసింది. ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని మిన్పూర్ శివారులో శనివారం ఉదయం జరిగింది. ఎస్ఐ మహిపాల్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాలు, టేక్మాల్ మండలం హాసన్మహమ్మద్పల్లి తండాకు చెందిన కున్సోత్ చిన్యా(45)కు భార్య మీరిబాయి, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరి వివాహాలు జరిగాయి. ఆయన తమ్ముడు అయిన కున్సోత్ దిన్యా(40)కు భార్య భూలీబాయితో పాటు కుమారుడు రాహుల్ ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ తండాలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. యాసంగి వరి తుకం పోయడానికి వరి విత్తన బస్తాలు కొనుగోలు చేయడం కోసం శనివారం ఉదయాన్నే చిన్యా, దిన్యాలు ద్విచక్ర వాహనంపై పాపన్నపేట మండలం లక్ష్మీనగర్కు బయలుదేరారు. దిన్యా వాహనం నడుపుతుండగా చిన్యా వెనక కూర్చున్నాడు. ఈ క్రమంలో పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామశివారులోని బారాఖానాల వంతెన వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అటుగా వస్తున్న వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబీకులకు విషయం తెలుపడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్యా భార్య మీరిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.