నారీమణులు
ABN , First Publish Date - 2023-09-21T23:28:20+05:30 IST
చట్టసభల్లో 33 శాతం స్థానాలను మహిళల కు రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్ అధినియం- 2023కి లోక్సభ ఆమోదం తెలపడంపై మహిళా నేతల్లో పార్టీలకతీతం గా హర్షం వ్యక్తమవుతోంది.

- రాబోయే ఎన్నికల్లో సత్తాచాటేందుకు సిద్ధం
- జాతీయ స్థాయికి ఎదిగిన డీకే అరుణ
- రిజర్వేషన్లతో రాణిస్తున్న మహిళలు
- అవకాశమొస్తే తగ్గేదిలేదంటోన్న అతివలు
మహబూబ్నగర్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): చట్టసభల్లో 33 శాతం స్థానాలను మహిళల కు రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్ అధినియం- 2023కి లోక్సభ ఆమోదం తెలపడంపై మహిళా నేతల్లో పార్టీలకతీతం గా హర్షం వ్యక్తమవుతోంది. రిజర్వేషన్లు లేకపోయినా కొందరు మహిళానేతలు ఇప్పటికే రాజకీయాల్లో రాణిస్తుంటే, మరి కొంద రు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో రాజకీయాల్లోకి కొనసాగుతు న్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలోనూ ఆదినుంచీ మహిళ లు పరిమితంగానే ఉన్నా రాజకీయాల్లో సత్తాచాటారు. ఎన్నిక లు సమీపిస్తోన్న తరుణంలో మహిళాబిల్లు స్ఫూర్తితో ఇప్పటికే రాజకీయాల్లో రాణిస్తున్న మహిళలతోపాటు కొందరు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలని ఉత్సాహం చూపుతున్నారు.
జాతీయస్థాయి నాయకురాలిగా డీకే అరుణ
పాలమూరు ఉమ్మడి జిల్లానుంచి రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళల్లో డీకే అరుణదే అగ్రస్థానం. ఆమె గద్వాల ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో అయిదేళ్ల పాటు మంత్రిగానూ ఉన్నారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి రెండు పర్యాయాలు పోటీచేసి పరాజయం పొందారు. బీజేపీలో చేరిన తర్వాత ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు.
ఎంపీ అభ్యర్థిగా బంగారు శ్రుతి..
మాజీ కేంద్రమంత్రి బంగారు లక్ష్మణ్ కుమార్తె హైదరా బాద్కు చెందిన బంగారు శ్రుతి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయినా నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ పనిచేస్తోన్న ఆమె మరోదఫా అక్కడే పోటీచేసి గెలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు.
జడ్పీ చైర్పర్సన్ గా, ఎమ్మెల్యేలుగా..
ప్రస్తుతం మహబూబ్నగర్ జడ్పీచైర్పర్సన్గా పనిచేస్తోన్న స్వర్ణాసుధాకర్రెడ్డి అమరచింత నియోజకవర్గం నుంచి ఒక పర్యాయం ఎమ్మెల్యేగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆమె మహ బూబ్నగర్ జడ్పీచైౖర్పర్సన్గా కొనసాగుతున్నారు. సీతా దయాకర్రెడ్డి సైతం ఉమ్మడి పాలమూరు జడ్పీచైర్పర్సన్గా అయిదేళ్లు పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజన అనంత రం ఆమె దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పరాజయం పొందారు. మళ్లీ ఇటీవల కాంగ్రెస్లో చేరి మక్తల్ నియోజకవర్గం నుంచి ఆమె టిక్కెట్ ఆశిస్తున్నారు.
బీసీవర్గాల నేతగా తెరపైకి సరిత
స్థానిక సంస్థల్లో అందివచ్చిన రిజర్వేషన్ల అస్త్రాన్ని అంది పుచ్చుకొని గద్వాల జడ్పీచైౖర్పర్సన్గా సరిత కొనసాగుతున్నా రు. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడమే లక్ష్యంగా ఆమె ఇటీవల కాంగ్రెస్లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆశీస్సులతో బీసీవర్గాల నేతగా టిక్కెట్ తనకు వస్తుందనే ధీమాతో ఆమె క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.
ప్రమోషన్ దక్కేదెవరికో..
ఉమ్మడి పాలమూరులోని అయిదు జిల్లాల్లో ప్రస్తుతం నాలుగు జడ్పీలకు చైర్పర్సన్లుగా మహిళలే కొనసాగుతు న్నారు. మహబూబ్నగర్ జడ్పీచైౖర్పర్సన్గా మాజీ ఎమ్మె ల్యే స్వర్ణాసుధాకర్రెడ్డి, గద్వాల జడ్పీచైౖర్పర్సన్గా సరిత, నారాయణపేట జడ్పీచైౖర్పర్సన్గా వనజాగౌడ్ ఎన్నికయ్యారు. నాగర్కర్నూల్ జడ్పీచైౖర్పర్సన్గా తొలుత పెద్దపల్లి పద్మావతి ఎన్నికవగా, ఆమెపై అనర్హత వేటుపడడంతో తాజాగా శాంతి కుమారి చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. గద్వాల జడ్పీచైౖర్ పర్సన్ సరిత మాత్రం ఎమ్మెల్యే కావాలనే ఆకాంక్షతో గద్వాల నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న కుటుంబానికి చెందిన వనజాగౌడ్ ప్రస్తుతం నారాయణపేట జడ్పీచైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఈమె గతంలో ఒక పర్యాయం ఎంపీటీసీ సభ్యురాలిగా, మరో పర్యా యం సర్పంచ్గానూ కొనసాగారు. ఇలా అవకాశమొస్తే జడ్పీ చైర్పర్సన్లుగా ఉన్న వీరు ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారిలో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
వీరు క్రియాశీలకమే...
ఉమ్మడి జిల్లాలో ప్రజాప్రతినిధులుగా, పార్టీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళా నాయకులు అవకాశమొస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి సత్తాచాటేందుకు ఉత్సాహం చూపుతున్నారు. నాగర్కర్నూల్ జడ్పీలో కాంగ్రెస్ ఫ్లోర్లీడర్గా ఉన్న అమ్రాబాద్ జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ సీ.అనూరాధ పేరు కాంగ్రెస్ అధిష్టానం అచ్చంపేట స్థానానికి పరిశీలి స్తున్నట్లు తెలిసింది. బీజేపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పనిచేస్తోన్న నాగర్కర్నూల్ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు కొండా మణెమ్మ అవకాశం వస్తే పోటీకి సిద్ధమంటున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావిస్తోన్న కాంగ్రెస్ నేత కాటమోని తిరుపతమ్మగౌడ్ సైతం గట్టి ప్రయ త్నాలు చేస్తుంటే, మాజీ ఎంపీపీ సుధారాణి సైతం ఇటీవల క్రియాశీలకమయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడి మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో పోటీచేశారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా పోటీచేయాలనే సంకల్పంతో బాలాత్రిపురాసుందరీ దేవి ఆనియోజకవర్గం లో విస్త్రుతంగా పర్యటిస్తున్నారు. ఇటీవలే బీఎస్పీలో చేరిన మహబూబ్నగర్ రూరల్ మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు బి.స్వప్న సైతం ఈసారి బహుజనవాదంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవాలని ప్రయత్నిస్తోంది.