ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతీ ఇంటికీ సంక్షేమం
ABN , First Publish Date - 2023-10-30T23:23:58+05:30 IST
ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డి
- గద్వాల మండలంలో విస్తృత ప్రచారం
గద్వాల/ గద్వాల న్యూటౌన్, అక్టోబరు 30 : ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొత్తపల్లి, రేకులపల్లి, గుంటిపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబిడ్డ ఆలోచనతోనే పుట్టింది రైతుబంధు అన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ అని వివరించారు. పేదలకోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్లతో పాటు దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు ఆరు గ్యారెంటీల పేరుతో మభ్యపెట్టడానికి వస్తుంటారని, వారి మాటలను నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయలేని పథకాలు ఇక్కడ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. వాళ్ల మాటలకు మోసపోయి గోస పడొద్దని సచించారు. కాగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి కొత్తపల్లి గ్రామంలో సర్పంచు ఆశోక్రెడ్డి ఆధ్వ ర్యంలో ఘన స్వాగతం లభించింది. అక్కడ ఓ టీకొట్టులో టీతాగి వారితో ముచ్చటించారు. కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, రైతుబంధు అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ ఆల్వాల్ ప్రతాప్ గౌడ్, పీఏసీఎస్ అధ్యక్షుడు సుభాన్, పార్టీ మండల అధ్యక్షుడు రాముడు, రమేష్ నాయుడు, మహేశ్వర్రెడ్డి, దామోదర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే మోసపోతారు
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమో కానీ.. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే గ్యారెంటీగా అందరూ మోసపోవాల్సి వస్తుందని గద్వాల ఎమ్మెల్యే అభ్యర్ధి బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన నాయకులు, మాజీ కౌన్సిలర్లు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో బీజేపీ మాజీ కౌన్సిలర్ నెమలికంటి జయమ్మ నర్సింహులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డిని గజమాల వేసి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్లో పలువురి చేరిక
బీజేపీ, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. నెమలికంటి జయమ్మ, నెమలికంటి సునీత, నాయకులు నెమలికంటి రామాంజనేయులు, నెమలికంటి నర్సింహులు, విజయ్, సద్దలశ్రీను, వేణు, వినోద్, శ్రీను, మధు, శ్రీకాంత్, ఆనంద్, జయ సింహ, ప్రశాంత్, సద్దల వెంకటేష్లతో పాటు మరో 300 మంది మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వినియోగదారుల సంఘం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామన్గౌడు, మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్ పాల్గొన్నారు.
- గద్వాల మండల పరిధిలోని పరుమాల, వీరాపురం గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు లక్ష్మన్న, వంశి, ప్రభుదాస్, సురేశ్, రాములు, సంజయ్, మహేష్లతో పాటు మరో 50 మంది బీఆర్ఎస్లో చేరారు. గోనుపాడు గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మేస్త్రీ తిమ్మప్ప, కర్రెప్ప, జయరాములు, అంజి, అనిల్రెడ్డి, పరశురాముడుతో పాటు, మరో 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
- మల్దకల్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నరసింహులు, కుర్వ లవన్న, గోపా ల్, తిమ్మప్ప, టైలర్ నర్సింహులుతో పాటు మరో వంద మంది బీఆర్ఎస్లో చేరారు. మల్లెందొడ్డి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, రామాంజనేయులు, భీమేష్, అంజనేయులు, మహేష్, కృష్ణ, ప్రవీ ణ్, నవీన్లతో పాటు 30 మంది బీఆర్ఎస్లో చేరారు.