హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలు శిక్ష
ABN , First Publish Date - 2023-05-26T22:59:23+05:30 IST
మహిళపై హత్యాయత్నం కేసులో ఆమె భర్త, అతడికి సహకరించిన మొదటి భార్య, ఆమె చెల్లెలి భర్తకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ.1000 జరి మానా విధిస్తూ గద్వాల అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ప్రభాకర్ శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ సృజన తెలిపారు.

- రూ. 1000 చొప్పున ఒక్కొక్కరికి జరిమానా
- వివరాలు వెల్లడించిన ఎస్పీ సృజన
గద్వాల క్రైం, మే 26 : మహిళపై హత్యాయత్నం కేసులో ఆమె భర్త, అతడికి సహకరించిన మొదటి భార్య, ఆమె చెల్లెలి భర్తకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ.1000 జరి మానా విధిస్తూ గద్వాల అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ప్రభాకర్ శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ సృజన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దేవరకద్ర మండలం బస్వాపూర్కు చెందిన ఫరీదాబేగం, శాంతినగర్కు చెందిన బషీర్ అహ్మద్ భార్యాభర్తలు. వారికి పిల్లలు పుట్టకపోవడంతో 17 సంవత్సరాల క్రితం గద్వాలకు చెందిన సాజిదాను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండు నెలలకు బషీర్ అహ్మద్ బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అప్పుడప్పుడు శాంతినగర్కు వచ్చి వెళ్లేవాడు. పెళ్లి అయిన తొమ్మిది సంవత్సరాల నుంచి సాజిదాను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పుట్టింటినుంచి నాలుగు లక్షల రూపాయ లు తెచ్చి ఇచ్చింది. ఆ తర్వాత అతడు సౌధీ నుంచి వచ్చినప్పుడల్లా అదనపు కట్నం కోసం ఆమెను వేధి స్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో 2019, నవంబర్ తొమ్మిదిన సాజిదా తన కుమారుడితో ఇంట్లో ఉండగా, బషీర్ అహ్మద్, అతడి మొదటి భార్య ఫరిదాబేగం, ఆమె చెల్లెలి భర్త గౌస్ బాషాలు ఆమెతో గొడవ పడి కొట్టి గాయపరచగా, చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. ఆ తరువాత కొంత సమయానికి ఆ ముగ్గురు మళ్లీ సాజిదాపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు యత్నించారు. దీంతో ఆమె కొడుకుతో కలిసి కేకలు వేస్తూ ఇంటినుంచి బయటకు వచ్చింది. ఈ మేరకు ఆమె శాంతినగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్ఐ శ్రీహరి విచారణ నిర్వహించారు. నిందితులు ఏ1 బషీర్ అహ్మద్, ఏ2 ఫరీదాబేగం, ఏ3 గౌస్బాషాలు హత్యాయత్నం చేసినట్లు రుజువు కావ డంతో జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. అనం తరం పోలీసులు పరిశోధనను పూర్తి చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు ట్రయల్ సమయంలో సాక్ష్యం చేప్పేలా డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్ సీఐ శివశంకర్ సాక్షులను మోటివేట్ చేశారు. న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, నేరస్థులకు జైలుశిక్ష, జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఇన్వెస్టిగేషన్ అధికారి, అప్పటి శాంతినగర్ ఎస్ఐ శ్రీహరి, ప్రస్తుత ఎస్ఐ శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్రాములు, కోర్టు కానిస్టేబుళ్లు మాబాషా, కోర్టు లైజనింగ్ అధికారి రఫీలను ఎస్పీ అభినందించారు.