కంటి వెలుగు పకడ్బందీగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2023-01-11T23:19:03+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ వనజమ్మ పేర్కొన్నారు.

కంటి వెలుగు పకడ్బందీగా అమలు చేయాలి
బ్రోచర్‌ను విడుదల చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌రెడ్డి, చిట్టెం, కలెక్టర్‌

జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ

నారాయణపేట టౌన్‌, జనవరి 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని జడ్పీ ఛైర్‌పర్సన్‌ వనజమ్మ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అంజనాగార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండో విడత ‘కంటి వెలుగు’ అవగాహన సదస్సుకు పేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికి కంటి చూపు బాగుండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో నాలుగు లక్షల మందికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాలికలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 24 బృందాలతో పాటు ఒక అదనపు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వందరోజుల పాటు కేవలం పనిదినాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించేందుకు 20 బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో, నాలుగు బృందాలు మునిసిపాలిటీల్లో పరీక్షలు నిర్వహిస్తాయన్నారు. దగ్గర చూపు లేని వారికి అక్కడికక్కడే అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇతర సైట్లు ఉన్నవారికి ఆన్‌లైన్‌లో డెటా నమోదు చేసుకొని, పక్షం రోజుల్లో ఆశ కార్యకర్తలు అద్దాలు ఇంటికి తీసుకువచ్చి ఇస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలన్నారు. ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ వినూత్నంగా ప్రారంభించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం 2018లో విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. రెండో విడత ఈనెల 18 నుంచి జూన్‌ 30వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంధత్వం నివారణకు ఇంత పెద్ద మొత్తంలో బృందాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇది గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డు కానుందన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ముందు చూపుతో చేపడుతున్న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా జిల్లాలోని ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మయాంక్‌ మిట్టల్‌, పద్మజారాణి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, కోస్గి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ శిరీష, గ్రంథాలయ చైర్మన్‌ రామకృష్ణ, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణబట్టడ్‌, జిల్లా వైద్యాధికారి రాంమనోహర్‌రావు, ఆర్డీవో రాంచందర్‌నాయక్‌, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-11T23:19:04+05:30 IST