ఉద్యోగం రాదని ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-06-26T22:55:44+05:30 IST
ఉద్యోగం సాధించాలనే తపనతో ఇటీవల నిర్వహించిన పోలీసు రిక్రూట్మెంట్ పరీక్ష రాసిన ఓ యువకుడు తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇటిక్యాల, జూన్ 26: ఉద్యోగం సాధించాలనే తపనతో ఇటీవల నిర్వహించిన పోలీసు రిక్రూట్మెంట్ పరీక్ష రాసిన ఓ యువకుడు తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల ఎస్ఐ గోకారి తెలిపిన వివరాల ప్రకారం.. ఇటిక్యాల మండలంలోని చాగాపురం గ్రామానికి చెందిన వెంకటేష్(24) హైదరాబాదులో ఉంటూ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకున్నాడు. ఇటీవల ప్రకటించిన మెయిన్ ఫలితాలు, ఈవెంట్స్ కలిపి 112 మార్కులు వచ్చాయి. వయస్సు కూడా తక్కువగా ఉండటంతో ఉద్యోగం రాదని బాధపడుతూ ఉండేవాడని వెంకటేష్ తండ్రి కాశన్న ఫిర్యాదులో పేర్కొన్నాడు. శనివారం హైదరాబాదు నుంచి గ్రామానికి వచ్చిన వెంకటేష్ ఆదివారం శాంతినగర్కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. గ్రామ సమీపంలోని తిరుమలయ్య గుట్ట దగ్గర పురుగుల మందు తాగి, వాంతులు చేసుకొని పడిపోయాడు. స్థానికులు గమనించి మృతుని సోదరుడు చంద్రశేఖర్కు తెలిపారు. కుటుంబీకులు అక్కడికి చేరుకొని వెంకటేష్ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.