Share News

రోడ్డుపైనే సంత

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:46 PM

స్గి పట్టణంలో వారాంతపు సంతతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

రోడ్డుపైనే సంత
రోడ్డుపైనే కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులు

- నిరుపయోగంగా కూరగాయల మార్కెట్‌

- వాహనదారులకు తప్పని తిప్పలు

- పట్టించుకోని పోలీసు, మునిసిపల్‌ అధికారులు

కోస్గి రూరల్‌, డిసెంబరు 17 : కోస్గి పట్టణంలో వారాంతపు సంతతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా వారాంతపు సంత రోడ్డుపైనే కొనసాగడంతో.. వాహనాలు ఓ వైపు నుంచి వెళ్లాల్సి వస్తోంది. దీంతో గంటల తరబడి వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. 108 వాహనం వస్తే సైతం గంటల పాటు ఆగాల్సిందే. గత రెండేళ్ల క్రితం మునిసిపాలిటీలో కోటి రూపాయలు వెచ్చించి కూరగాయల మార్కెట్‌ కట్టినా అది ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమైంది. కూరగాయల వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారం చేసుకుంటున్నారు. లక్షల రూపాయలు తైబజార్‌ వేలం వేసినా, మునిసిపాలిటీకి ఆదాయం వచ్చినా ఫలితం మాత్రం శూన్యం. కనీస వసతులు లేకుండా వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారం చేసుకుంటున్నారు. గతంలో పలుమార్లు ఈ విషయంపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కకపోవడంతో వ్యాపారులు చేసేది లేక రోడ్లపై వ్యాపారం చేసుకుంటున్నారు. గుత్తేదారు మాత్రం ముక్కుపిండి వ్యాపారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నాడు. మునిసిపల్‌ కమిషనర్‌ను అడిగితే స్థలం సరిపోవడం లేదని, అందుకే వ్యాపారులు వినిపించుకోకుండా రోడ్లపై కూర్చుంటున్నారని సమాధానం చెబుతున్నారు.

పట్టించుకోని పోలీసులు

రోడ్లపై సంత ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉందని పదే పదే చెప్పినా పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు. స్థానిక శివాజీ కూడలిలో రోడ్డుకు అడ్డంగా తోపుడు బండ్లపై వ్యాపారులు పండ్లు విక్రయించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ పోలీసు సిబ్బంది ఉండి ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించాల్సింది పోయి తమకేమి పట్టనట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీంతో వాహనదారులు ఆదివారం వస్తే చాలు వద్దురా బాబు ఈ సంతలో ట్రాఫిక్‌ భరించలేమన్న చందంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 10:46 PM