పాఠశాలల బంద్ ప్రశాంతం
ABN , First Publish Date - 2023-06-26T23:11:11+05:30 IST
విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఇచ్చి పిలుపు మేరకు సోమవారం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది.
- విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
- ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సతీష్
గద్వాల టౌన్, జూన్ 26 : విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఇచ్చి పిలుపు మేరకు సోమవారం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థలన్నీ స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు యధావిధిగా ప్రారంభం కావడంతో, ఏబీవీపీ నాయకులు వెళ్లి తరగతులను బహిష్కరించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చేసిన ప్రైవేటు విద్యాసంస్థలను కట్టడి చేయకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. సొంత రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రకు చెందిన ప్రైవేటు విద్యాసంస్థలను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొడతామన్న అప్పటి ఉద్యమకారుడు కేసీఆర్ మాటలు బట్టదాఖలయ్యాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు - మన బడి పేరుతో పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సురేష్, నగర కార్యదర్శి గణేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్, రఘువంశీ, జిల్లా నాయకులు నరేష్, తేజ, మహేష్, వెంకటేష్, వంశీ, అనిల్, గణేష్, శివకృష్ణ, చందు పాల్గొన్నారు.
ఫీజులను కట్టడి చేయాలి
ధరూరు : ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులను కట్టడి చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సురేష్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరిం చాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలని కోరారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ధరూరు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ధరూరు కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులను ఏబీవీపీ నాయకులు బహిష్కరించారు. కార్యక్రమంలో రఘు, నర్సింహులు, విష్ణు ఉన్నారు.