నవ సంకల్పం సక్సెస్‌

ABN , First Publish Date - 2023-06-26T00:03:24+05:30 IST

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన నవ సంకల్ప సభ సక్సెస్‌ అయింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రులు మహేంద్రనాథ్‌ పాండే, జి.కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నవ సంకల్పం సక్సెస్‌
సభలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

నాగర్‌కర్నూల్‌ బహిరంగ సభలో బీజేపీ నాయకుల జోష్‌

ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రులు

నాగర్‌కర్నూల్‌/నాగర్‌కర్నూల్‌ టౌన్‌, (ఆంధ్రజ్యోతి), జూన్‌ 25:

ఇటీవల బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య అంత ర్లీనంగా ఒప్పందాలు కుదిరాయనే నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయడానికే భారతీయ జనతా పార్టీ ప్రధాన లీడర్లు దృష్టి కేంద్రీకరించారు. భారత రాష్ట్ర సమితితో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి లోపాయికారి ఒప్పందాలు లేవనే దిశగా నాయకుల ప్రసంగాలు కొనసాగాయి. ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజాగోపాల్‌రెడ్డి నిన్న కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసి.. కేటీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇస్తే పార్టీ పరిస్థితి ఇంకా దిగజారుతుందని, ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీజేపీలతో ఒప్పందాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే అరుణతో సహా బీజేపీ ప్రధాన నాయకులు జితేందర్‌రెడ్డి, శాంతాకుమార్‌ బీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమైన అంశమేమిటంటే జిల్లా పరిషత్‌ మైదానంలో 2018 ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమావేశం కంటే భిన్నంగా భారీ ఎత్తున జనం కదిలిరావడం ఆ పార్టీ వర్గాల్లో బలమైన సంకల్పాన్ని నింపింది. జేపీ.నడ్డాతో సహా బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా హాజరై, బీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ లక్ష్యాన్ని నీరుగార్చిన కేసీఆర్‌

ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ కీర్తిని పెంచు తుంటే రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తెలంగాణ లక్ష్యాన్ని నీరుగార్చారని బీజేపీ జాతీ య ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసమే తెలంగాణ వచ్చి నట్లు వారి పాలన కని పిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కల్వకుంట్ల కుంటుం బమే బంగారంగా మారిందని ఆరోపిం చారు. తెలంగాణను అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌ ఒక్కసారి పాలమూరు ప్రాంతానికి వచ్చి ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపిం చాలని సవాల్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేసి ఇక్కడి రైతాంగం కాళ్లు కడుగుతానన్న కేసీఆర్‌ తొమ్మిదేళ్లయినా ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోర్టు కేసులతో పనులు ముందుకు సాగడం లేదని పదే పదే చెబుతున్న సీఎం, కేసు వేసిన వ్యక్తిని తన సంకలోనే పెట్టుకున్నారని విమర్శించారు. తండ్రీ కొడుకులు ఇద్దరికీ దమ్ము, దైర్యం ఉంటే వచ్చి వారు చేసిన అభివృద్ధిని చూపాలని డిమాండ్‌ చేశారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌తో అలయన్స్‌ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీజేపీని ఎదుర్కొనలేకే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.

బీజేపీతోనే కేసీఆర్‌ కుటుంబ పాలన అంతం

రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన అంతం కావాలంటే బీజేపీతోనే సాధ్యమని బీసీ కమీషన్‌ కేంద్ర మాజీ సభ్యుడు, బీజేపీ సీనియన్‌ నాయ కుడు తల్లోజు ఆచారి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమిచ్చిందని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు మోదీ ఇచ్చిన వేల కోట్లు నిఽధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మాటలు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు.

నీళ్లు తేకపోతే సీఎం రాజీనామా చేస్తారా?

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి, సెస్టెంబరు.. అక్టోబరు నెలల్లో కర్వెన రిజర్వాయర్‌ ద్వారా తాగునీరు ఇస్తామని పలుకుతున్న సీఎం కేసీఆర్‌ చెప్పిన సమయానికి నీళ్లు ఇవ్వక పోతే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ నాయకుడు ఏపీ.జితేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. నార్లాపూర్‌ వద్ద నిర్మాణ పనులు పూర్తి కాకుండానే నీళ్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు.

సోమశిల-సిద్ధేశ్వరం వంతెన ఘనత బీజేపీదే

సోమశిల-సిద్ధేశ్వరం వంతెన కోసం రూ.1,000 కోట్లు ఇచ్చిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి అన్నారు. అలాగే జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ.73 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. నాగర్‌ర్నూల్‌ పార్లమెంటుకు బీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం తెచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు మాట్లాడుతూ సోమశిల -సిద్దేశ్వరం బ్రిడ్జితో పాటు జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ మీదుగా జాతీయ రహ దారికి రూ.వేల కోట్లు కేంద్రం మంజూరు చేసిం దన్నారు. పార్టీ నాగర్‌ కర్నూల్‌ ఇన్‌చార్జి దిలీప్‌ చారి మాట్లాడుతూ బీజేపీ తోనే సబ్బండ వర్గాల అభి వృద్ధి సాధ్యమన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని అన్నారు.

Updated Date - 2023-06-26T00:03:24+05:30 IST