నాడు వెలవెల.. నేడు కళకళ
ABN , First Publish Date - 2023-09-04T22:36:06+05:30 IST
ఐదేళ్ల క్రితం విద్యార్థుల సంఖ్య లేక శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నేడు ఐదు తరగతులకు గాను 79 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది.
- నాడు రెండంకెల సంఖ్యలో లేని విద్యార్థులు, నేడు 79 మంది
- శిథిలావస్థలోని పాఠశాలకు మెరుగులు దిద్దిన ఉపాధ్యాయుడు
నారాయణపేట రూరల్, సెప్టెంబరు 4 : ఐదేళ్ల క్రితం విద్యార్థుల సంఖ్య లేక శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నేడు ఐదు తరగతులకు గాను 79 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. దీనంతటికీ కారణం ఆ పాఠశాలకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడి కృషి అని చెప్పవచ్చు. నారాయణపేట మండలం లక్ష్మీపూర్ ఎంపీపీఎస్ పాఠశాల ఐదేళ్ల కిత్రం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకుని తలుపులు, కిటికీలు లేక గొర్రెలు, మేకలు నిలిపేందుకు నిలయంగా మారింది. అయితే 2018లో బదిలీపై ఆ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు వై.జనార్దన్రెడ్డి మిత్రులు, గ్రామస్థల సహకారంతో పాఠశాలను మరమ్మతు చేయించారు. సర్పంచ్, ఎంపీటీసీ, దాతల సహాకారంతో పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో సఫలీకృతుడయ్యాడు. సింగిల్ డిజిట్ విద్యార్థుల నమోదు నుంచి ప్రస్తుతం 79 మంది విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠ శాలకు వచ్చేలా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బడి పరిసరాలను శుభ్రం చేయించి ఎల్ఈడీ ద్వారా డిజిటల్ భోధన చేసి, ఎమ్మెల్యే, కలెక్ట ర్లతో అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలను చేయించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా కృషి చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్ర మంలో భాగంగా పాఠశాలలో నాటిన మొక్కలు నేడు పెద్దగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. పాఠశాల మన ఊరు - మన బడికి ఎంపికై మరుగుదొడ్లు, విద్యుత్, మంచినీటి వసతి కల్పించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట టౌన్, గ్రామస్థుల సహాకారంతో విద్యార్థులకు లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తక పఠనంపై మక్కువ పెంచేటట్లు చేశారు. విద్యార్థులు, సదుపాయాలు లేక, ఉన్న ఒక ఉపాధ్యాయుడిని సైతం డిఫ్యూటేషన్పై పంపి వీవీలతో నడిచే పాఠశాల మూతబడే స్థితికి చేరుకున్న తరుణంలో ఇద్దరు ఉపాధ్యాయులను డిఫ్యుటేషన్పై ఇక్కడ పని చేసేలా కృషి చేశారు. దీంతో లక్ష్మీపూర్ గ్రామస్థులు సైతం తమ పిల్లలను అక్కడికే పంపి ప్రభుత్వ పాఠశాలపై గౌరం పెంచుకునేటట్లు చేశారు.