‘మద్దతు’కు మించి మార్కెట్ ధర
ABN , First Publish Date - 2023-12-05T23:42:07+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఖరీఫ్ పంట చేతికందుతోంది. జూరాల, నెట్టంపాడు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసిన వరి కోతకొచ్చింది. ముందు వేసిన రైతులు నూర్పిడి చేసి కల్లాల్లో ఆరబెడుతున్నారు.
- నేరుగా రైతుల వద్దకే వ్యాపారులు
- కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు
- వెలవెలబోతున్న కొనుగోలు కేంద్రాలు
గద్వాల, డిసెంబరు 5 : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఖరీఫ్ పంట చేతికందుతోంది. జూరాల, నెట్టంపాడు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసిన వరి కోతకొచ్చింది. ముందు వేసిన రైతులు నూర్పిడి చేసి కల్లాల్లో ఆరబెడుతున్నారు. మరికొందరు మార్కెట్కు తరలిస్తున్నారు. నెల రోజులుగా గ్రామాల్లో ఎన్నికల హడావిడి నెలకొని ఉండటం, కూలీల కొరతతో కోతలు కొంత ఆలస్యం అయ్యాయి. ఎన్నికల సందడి ముగియడంతో మళ్లీ రైతులు, కూలీలు ఎవరి పనుల్లో వారు నిమగ్నం కావడంతో వరి కోతలు పుంజుకుంటున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 30 శాతం కోతలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది. 2,65,888 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేసి కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందు కోసం 23.50 లక్షల గన్నీ బ్యాగులు అవసరం అని గుర్తించి ఇండెంట్ పెట్టింది. 58 రైస్మిల్లులకు ధాన్యం తరలించాలని ఒప్పందం చేసుకున్నది. అదేవిదంగా 74 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, వాటిలో 10 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది.
బయటి మార్కెట్లో విక్రయాలు
చేతి కందిన పంటను రైతులు బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఏ గ్రేడ్- రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183గా ఉంది. అయితే వ్యాపారస్తులు అంతకు మించి సోనా మసూరికి రూ.2500 నుంచి 2,600 వరకు, ఆర్ఎన్ఆర్ రకానికి రూ.3,100 ధర లభిస్తోంది. దీంతో ఎక్కువ మంది రైతులు బయట మార్కెట్లోనే విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కొందరు వ్యాపారులు నేరుగా కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. రవాణా, హమాలీ చార్జీలు ఊడా వారే భరిస్తున్నారు. మద్దతు ధరకు మించి ధర పలకడం, కష్టం లేకుండా ధాన్యం కొనుగోలు అవుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వ్యాపారులైతే 15 రోజుల కాలపరిమితితో విక్రయిస్తుండగా, కొత్త వ్యాపారులకు నగదు చెల్లించిన తర్వాతనే ధాన్యం ఎత్తిస్తున్నారు. అయితే రూ.100కు ఒక రూపాయి పట్టుకొని వ్యాపారులు నగదు చెల్లింపులు చేస్తున్నారు. మార్కెట్కు తరలించిన రైతులు మాత్రం రవాణా చార్జీలతో పాటు కమీషన్ను కూడా భరించాల్సి వస్తోంది. అయినప్పటికీ ఎక్కువ ధర పలుకుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ ధర పలకడం సంతోషం
నర్సింహులు, రైతు గుంటిపల్లి : నేను మూడు ఎకరాల్లో సోనామసూరి ధాన్యం పండించాను. మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుందని గద్వాల వ్యవసాయ మార్కెట్కు తరలించాను. ఇక్కడ సోనామసూరి క్వింటాలుకు రూ.2,600 ధర లభిస్తోంది. డబ్బులు కూడా వెంటనే ఇస్తున్నారు. ఈ ఏడాది మద్దతు కంటే ఎక్కవ ధర రావడం సంతోషంగా ఉంది.